పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నైహికఫలంబు వినిపింతు నతిదరిద్రుఁ, డధికసంపదఁ బొందు గొడ్రాలు సుతులఁ
గాంచు నన్నియు నేటికి నెంచఁ బాయు, బ్రహ్మహత్యాదిబహువిధపాతకములు.

11


క.

ఈసువ్రతంబు తత్పర, యై సలిపినఫలమునం గదా మును లయవే
ళాసాగరమగ్నధరిత్రీసతి హరిచేత నుద్ధరింపఁగఁబడియెన్.

12


చ.

అమృతరసోపలబ్ధికి సురాసురవీరులు గూడి పుష్యమా
సమున సముత్పతచ్ఛఫరశైవలకర్కటచక్రనక్రవి
ద్రుమలహరీఘటాగగనరోధిఁ బయోధి మథింప నిందిరా
రమణుఁడు దాల్చె మందరధరాధరభారముఁ గచ్ఛపాకృతిన్.

13


గీ.

అమ్మహాకచ్ఛపేంద్రప్రియంబుగా విశుద్ధమానసుఁడై పుష్యశుద్ధదశమి
నాఁడు పూర్వప్రకారంబున నరుఁడు దా ను, చితవిధులు దీర్చి యేకాదశీదినమున.

14


వ.

స్నానాదికృత్యంబులు జరపి నానావిధపరిష్కారమనోహరం బైనమంటపాంతరం
బున రాత్రి లక్ష్మీకళత్రు నారాధించి కూర్మాయ నమో యని పాదంబులు నారాయ
ణాయ నమో యని కటీరంబును సంకర్షణాయ నమో యని యుదరంబును విశో
కాయ నమో యని యురస్స్థలంబును భవాయ నమో యని కంఠంబును సుబాహవే
నమో యని భుజంబులును విశాఖాయ నమో యని శిరంబును జక్రాయ నమో యని
చక్రంబును శంఖాయ నమో యని శంఖంబును బూజించి తద్దేవతాగ్రభాగంబునం
గలశంబులు పూర్వప్రకారంబున నిలిపి మధ్యకలశోపరిస్థలంబున హైయంగవీనపూర్ణ
తామ్రపాత్రంబున యథాశక్తి భర్మనిర్మితసమందరకూర్మప్రతిమ ప్రతిష్ఠించి షోడశోప
చారంబులు సలిపి జాగరణంబు గావించి మఱునాఁడు సూర్యోదయావసరంబునం
గలశప్రతిమాదానంబులు చేసి వసుమతీసుపర్వులకుఁ బాయసాహారంబులు సదక్షి
ణంబుగా నొసంగి భృత్యవర్గంబును దాను భుజియించిన జననశతత్రయార్జితపాత
కంబులం బాసి యిహలోకంబున బహుసౌఖ్యంబు లనుభవించి విష్ణుసామీప్యం
బున నాబ్రహ్మకల్పంబు వసియించి పిదప మర్త్యభువనంబునం బుట్టి పట్టభద్రుండై.

15


ఉ.

భంగములై నగంబులు గుభాలునఁ ద్రెళ్ళఁ గరళ్ళదాఁటుతో
నింగికిఁ బొంగువారిధి మునింగినభూవలయంబు కన్నెగే
దంగితుద న్వసించినమదప్రదసౌరభనిశ్చలీభవ
ద్భృంగముఁ బోలఁ గొమ్ముకొన నెత్తె మురారి వరాహరూపమై.

16


గీ.

ఆకిరీశ్వరప్రియంబుగాఁ బూర్వవి, ధమున మాఘశుద్ధదశమి నుచిత
కృత్యములు ఘటించి యేకాదశీతిథి, నధికభక్తుఁ డైనయన్నరుండు.

17