పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ముఖ్యగీర్వాణచమూసమూహములతో సేనాని యెలగోలు చేసి రాత్రి
చరసైన్యములఁ బారి సమరె నాదైత్యులు సురల మార్కొని యేపు చూపుచోట
సరభసంబునఁ గలహభోజనుఁడు నార, దుండు చని విన్నవింప విష్ణుండు వచ్చెఁ
బక్షిపతి నెక్కి పైఁడిదుప్పటిచెఱంగు, దూలఁగా బిట్టు వాగెలఁ దోలుకొనుచు.

114


ఉ.

ఆహరిఁ జూచి వేలుపు లహంకరణంబుల దైత్యసేనతో
నోహరిసాహరం బెనఁగ హుమ్మని వైరుల నుగ్గునూచముల్
గా హరియింతు నే నని చలంబున నంధకుఁ డాగ్రహించి పై
రా హరిణాంకశేఖరుఁ డురస్స్థలి శూలమునం బగిల్చినన్.

115


గీ.

రక్తకణరాజి విశ్వంభరాతలమునఁ, దొరిగె జొటజొట నందుఁ బుట్టిరి నిలింప
వాహిని చలింప జిహ్వాలవక్త్రవివరు, లంధకాసురవరులు సంఖ్యలకు మీఱి.

116


సీ.

వారలఁ గరచక్రధారల వ్రచ్చి వందఱ లాడె హరి పురత్రయవిభేది
మూలాంధకాసురు శూలాగ్రమున గ్రుచ్చి యెత్తె నెత్తిన నెత్తు రేఱులై ర
ణాంగణంబునఁ బాఱె నందు నంధకు లనేకసహస్రములు పుట్టఁ గాంచి మిగుల
నాగ్రహించిన దర్పకారాతిముఖమున నెఱమంట వెడల యోగీశ్వరీస
మాఖ్య గలశక్తియై నిల్చె మఱియు నొక్క, శక్తి నిర్మించె నాత్మలాంఛనకళాను
షక్తిఁ గేవలసాహసవ్యక్తి రాక్ష, సేంద్రభీషణశక్తి మహేశ్వరుండు.

117


వ.

విష్ణుబ్రహ్మకుమారేంద్రదండధరవరాహ స్వాములు తమతమరూపచిహ్నంబులు
దాల్చినశక్తులం గల్పాంతవహ్నికల్పంబులం గల్పించిరి యిప్పగిది నుప్పతిల్లినయో
గీశ్వరీప్రముఖశక్త్యష్టకంబు భుజావష్టంభసంరంభంబున విజృంభించి రుధిరసంభూ
తాంధకసహస్రంబుల సంహరించి వదనగహ్వరంబులు దెఱచి కండలు కటుకు
కటుకునఁ గఱచియు రక్తంబులు గుటుకుగుటుకునం గ్రోలియుఁ గీకసంబులు
పెటుకుపెటుకున విఱిచియుఁ బ్రేవులు పుటుకుపుటుకునం దెంచియు విహరించి
రణక్రీడ చాలించె నీలకంఠుండు నంధాకాసురుం బరిమార్చి పేర్చి విజయంబునఁ
గైలాసంబునకుం జనియె నారాయణుండు వైకుంఠంబున కేగె భారతీవల్లభుండును
సత్యలోకంబున కరిగె హరిహయాదిహరిదీశానులు నాత్మనివాసంబులకుం బోయి
సుఖం బుండిరి మహీమండలేశ్వరి కామంబు యోగీశ్వరి క్రోధంబు మహేశ్వరి
లోభంబు వైష్ణవి మదంబు బ్రాహ్మి మోహంబు కౌమారి మాత్సర్యం బైంద్రి పైశు
వ్యంబు దాండధరి యీర్ష్య వారాహి యీమాతృకలజనం బష్టమీదివసంబు గావున
నాఁడు కథ విని బిల్వాహారు లైనవారికి భోగమోక్షంబులు సిద్ధించు నింక మాయ
దుర్గయై జన్మించినవిధంబు వినుము.

118