పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నాశైవస్థలులన్ వసించితిమి కాంతా నిన్నుఁ బోలంగ రా
కాశీతాంశునిభాస్యలం గనము లోకఖ్యాతశీలంబునన్.

18


క.

నాపత్ని నిర్నిమిత్తము, గోపించి తొలఁగి పోవఁ గ్రుస్సి మనస్సం
తాపంబుతోడ వెదకుచుఁ, బైపాటున నిన్నుఁ గంటి భాగ్యముకతనన్.

19


సీ.

ఆఁకలి గొన్నాఁడ నశనంబు పెట్టింపు మది నన్ను బ్రాహ్మణమాత్రుఁగా వి
చారింపకుము విను శ్రౌతకర్మమును దక్షత వహించినప్రతిస్పర్ధి విఱుగ
దట్టించి నాల్గువేదములు విభాళించి బ్రహ్మరథం బెక్కి బహువిధాధ్వ
రాగ్రపూజనము పరిగ్రహించినజగజెట్టి యోగ్యుఁడ నిన్ని చెప్ప నేల
నాకు నొకనికిఁ బెట్టు ముల్లోకములకుఁ, దృప్తి గలుగు నటన్న గిరీంద్రకన్య
భూనిలింప ఫలంబులు గాని యిచట, నశనము గడింప రాదు నీయడుగులాన.

20


క.

కాన ఫలాహారముఁ గొనఁంగా నీచిత్తమున వేడ్క గలదేని గృత
స్నానుఁడవై రమ్మన నా, హా నావాంఛితము సఫల మయ్యె నటంచున్.

21


శా.

పట్టెన్ గట్టదరిన్ మహామకర మబ్రహ్మణ్యమై దా ననుం
జట్టల్ దూయక యుండ రమ్ము విడిపించన్ గట్టుకో కీర్తికిన్
బట్టంబున్ సుకృతాత్మురాల భువనప్రఖ్యాతిగా నంచుఁ గూ
వెట్టన్ వించు నమశ్శివాయ యని భూభృత్కన్య వైయాకులిన్.

22


క.

పితృభావన హిమవంతునిఁ బతిభావన శివునిఁ దక్కఁ బరు నంటని నే
నితనిభుజాదండము ప, ట్టి తిగువఁగా నెట్టు లోర్తు డెందము గలఁగెన్.

23


గీ.

అయిన నితనికరస్పర్శనాపయశము, మాన్పుకొనవచ్చుఁ గాని బ్రాహ్మణుఁడు మొసలి
బారిఁ బడి చావఁ గావనిపాతకంబు, మాన్పుకొనరాదు జన్మజన్మములు ననుచు.

24


క.

వలిచనుగుబ్బల నునువ, ల్కలచేలము జాఱ నడుము గడగడ వడఁకన్
గలకంఠశ్రుతి గెలిచిన, యెలుఁగున బ్రాహ్మణున కభయ మిచ్చుచుఁ బఱచెన్.

25


గీ.

పఱచి పార్వతి పరమకృపారసంబు, భయరసంబు మనంబులోపలఁ దొలంక
గంగదరి ద్రొక్కి నిలిచి తత్కపటవిప్రు, పాణి కరపల్లవంబునఁ బట్టి తిగువ.

26


మ.

కులకాంతాకరసంగమంబు మఱియుం గొందాఁక నాకాంక్ష సే
యులలాటాక్షుని సమ్మతిన్ మొసలి నిమ్నోదప్రవాహంబులో
పలికిన్ రాఁ దిగుచున్ మరుత్తటినీసాపత్న్యంబునం బార్వతీ
లలనం గైకొన నీక వల్లభునిఁ గేలం బట్టుచందంబునన్.

27


క.

ఈపగిది మొసలి సలిలము, లోపలికిన్ దిగువఁ దా వెలుపలికిఁ దిగువన్
బాపనిఁ గొంతదడవు మే, నాపుత్రిక తిగిచి తిగిచి నాఁటినవగలన్.

28