పుట:వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ).pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

బరవస మైనయీతనివిపద్దశ యేగతి మాన్పుదుం గటా
హరహర యంచుఁ బల్కుటయు నవ్వచనధ్వనికంటె మున్న శం
కరుఁడు నిజాకృతి న్నిలిచె గంధగజేంద్రముతోలు మౌళి పె
న్నురువులజాలు పాపమొలనూలు సితాంగముడాలు మీఱఁగన్.

29


సీ.

ఆవేళ గిరిజ దా నాదిజన్మంబునఁ దొలఁగి యేతెంచుట దలఁచి నాన
నాననాబ్జము వంప నభవుండు నవ్వుటాలకుఁ బల్కెఁ గోకిలాలాప నన్నుఁ
జెట్టపట్టక వృథ సేయకు మన్నఁ బన్నగహార ఘోరకాననములోనఁ
దపము గావించుట ధవునిఁగా నినుఁ గోరి కావున నది వృథ గాదు వినుము
విన్నవించెద నొకమాట నన్నుఁ గన్న, తండ్రి నీహారనగరాజు ధారవోసి
యీనిఖిలలోకవిదితంబుగా ననూన, వైభవంబున వచ్చి వివాహ మగుము.

30


వ.

అని సవినయంబుగా ననునయాలాపంబులు పలికి చిట్టకాలకుఁ జెట్ట వట్టి విడువని
గట్టువిలుకాని నెట్టకేలకు నొడంబఱచి తదనుమతిం బార్వతి పుట్టినింటికిం జనియె
ముక్కంటియు నిజనిశాంతం బైనరజతసానుమంతంబునకు విజయం చేసె నట్లు
పుట్టినింటికిం జని తనకావించినఘోరతపఃప్రభావంబునకు మెచ్చి కృపాసము
ద్రుండు రుద్రుండు ప్రత్యక్షంబై పలికినచందంబు సమందాక్షంబుగా మందమం
దాక్షరంబుల నుమాకాంత హిమవంతునికి విన్నవించి జనక కనకధన్వుండు వెను
కటిజన్మంబున మత్ప్రాణవల్లభుండు గావున నది యెఱింగించితి మీఁదటికర్త
వ్యంబు మీక తెలియు నన్న నన్నందనిం జూచి నిజాంతర్గతంబున నేఁడు నాజీవ
నంబు పావనం బయ్యెఁ బొమ్మంచు మంచుగుబ్బలిరాచవాఁడు పరమానంద బొప్ప
మకరందతుందిలనయనారవిందుండై.

31


క.

ఎల్లజగంబులు నేలిన, హల్లకహితజూటుఁ డల్లుఁ డయ్యెడు నఁట నా
యిల్లు వెలసె లోకంబులఁ, దల్లీ రుద్రాణి యెట్టిధన్యుఁడ నొక్కో.

32


గీ.

పరమపావని విశ్వప్రపంచజనని, వైననినువంటికూఁతును గాన లేరు
గాన నానాసుపర్వులలో నపత్య, వంతు లెవ్వారు నాయీడువారు గారు.

33


మ.

అని గౌరీరమణీశిరోమణికి నాహ్లాదంబుగాఁ బల్కి వే
చని లోకైకపితామహున్ నలువ నాస్థానంబులో నుండఁగాఁ
గని దేవా శశిఖండమౌళికి నుమం గల్యాణి నాకూర్మినం
దన నీ నాత్మఁ దలంచి దేవరకు విజ్ఞాపింప నేతెంచితిన్.

34


క.

వావుడు సంతసమున వా, ణీవిభుఁ డిది మంచితలఁపు నీహారగిరీం
ద్రా వివిధామరసహితుఁడ, నై వచ్చెదఁ బెండ్లి చూడ నాయితపడుమా.

35