పుట:లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జరిగి, పంజాబు బ్రిటిష్ వారి పరమైంది. 1849 మార్చి 29న లాహోర్ రాజప్రాసాదం విూద బ్రిటిష్ పతాకం ఎగిరింది. పంజాబును బ్రిటిష్ సామ్రాజ్యంలో కలుపుతూ లాంఛనంగా చేసుకున్న ఒప్పందంలో "షాషుజా ఉల్ముల్క్ నుంచి రంజిత్ సింగ్ స్వాధీనం చేసుకున్న కోహినూర్ వజ్రాన్ని లాహోర్ మహారాజు బ్రిటిష్ రాణికి అప్పగించాల”న్నది ఒక అంశం.

కోహినూర్ వజ్రాన్ని ముగ్గురు బ్రిటిష్ సభ్యులతో ఏర్పాటైన పంజాబు ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. ఈ ముగ్గురిలో ఒకరైన జాన్ లారెన్స్‌కు దీని రక్షణ బాధ్యత అప్పగించడమైంది. అయితే ఈయన ఈ వజ్రాన్ని భద్రపరచిన పేటికను తన కోటు జేబులో వుంచుకుని, ఆ విషయం మరిచిపోయి కోటును విడిచి ప్రక్కన పడేశాడు. ఈ సంఘటన జరిగిన ఆరువారాలకు గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ నుంచి వర్తమానం వచ్చింది రాణీగారు వజ్రాన్ని బ్రిటన్‌కు తరలించే ఏర్పాటు చేయమని ఉత్తర్వులు జారీ చేశారని. ఈ విషయం ముగ్గురు సభ్యుల సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. అప్పడు కానీ జాన్ లారెన్స్‌కు గుర్తుకు రాలేదు - వజ్రాన్ని తాను కోటు జేబులో వదిలేశానని. ఆయన గొంతు తడారిపోయింది. తన నివాసానికి చేరిన వెంటనే వజ్రాన్ని వుంచిన్న పెట్టె గురించి పనివాణ్ణి అడిగాడు - "కొన్ని రోజుల క్రితం నా కోటు జేబులో నుంచి ఒక చిన్న పెట్టె తీశావా" అని. ఆ పనివాడు పెట్టెను కోటు జేబులో నుంచి తీసి లారెన్స్ కప్‌బోర్డులో ఉంచానని చెప్పాడు. లారెన్స్‌కు ప్రాణాలు లేచివచ్చాయి. ఆ పెట్టెను తెమ్మని పనివాడికి చెప్పగా అతనాపెట్టెను తెచ్చి, లారెన్స్ ముందే తెరిచి, గుడ్డ పేలికల మధ్య నుంచి వజ్రాన్ని బయటికి తీసి, తన చేతిలో వున్న వస్తువు ఎంతటి అమూల్యమైందో తెలియక, "దొరా ! ఇందులో ఏమి లేదు - ఒక చిన్న గాజు ముక్క తప్ప" అని చెప్పాడు. లారెన్స్ వెంటనే ఆ వజ్రం ఉన్న పెట్టెను నౌకరు నుంచి దొరక పుచ్చుకుని మిగిలిన ఇద్దరు సభ్యుల వద్దకు వెళ్ళి చూపించాడు. ఈ విధంగా కోహినూర్ వజ్రం దాదాపుగా పోయి, దాని విలువ గ్రహించలేని నౌకరు మూలంగా మళ్ళీ దొరికింది.

46