Jump to content

పుట:రంగనాథరామాయణము - ఉత్తరకాండ.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వరుస దివ్యులు పుష్పవర్షముల్ గురియ, సురనాథుఁ డారాజసుతు మేనితోడ
గొని నాకమున కేగె కూడి దేవతలు, మునులును నేతెంచి ముదమారఁ గాంచి,
విష్ణునాలవపాలు వేంచేసె ననఁగ, విష్ణులోకమునకు వేంచేసె నచట
నంత రాముఁడు వసిష్ఠాదులఁ జూచి, వింతయై యున్నది విశ్వంబు నాకు.
ధరణి యేటికి నాకుఁ దను వేటి కింక, భరతు నయోధ్యకుఁ బట్టంబు గట్టి
సౌమిత్రి వెనుకను జనియెద ననిన, నామాటలకు యోడి నారాజసుతుడు
రాజేంద్ర పరలోకరాజ్యంబె గాదు, రాజిల్లు సురలోకరాజ్య మే నొల్ల
మిముఁ బాసి యే నుండ మీపాదసేవ, సముచితస్థితి నాకు సకలరాజ్యంబు
తిరముగాఁ గోసలదేశంబు గుశుఁడు, గురుకీర్తి నుత్తరకురుభూమి లవుఁడు,
సరి నేల పనుపుడు శతృఘ్నుఁ బిలువ, నరనాథ బుధుఁడు నావసిష్ఠుండు
రాముఁ గనుగొని రఘుకులాధీశ, నీమాట విని యట్లు నిర్విణ్ణులైన
ధరణీజనుల దీర్పదగునన్నఁ జూచి, నరులార యేమే లొనర్తు మీ కనుఁడు
నందఱు ముకుళితహస్తులై నిలిచి, యెందును మాకు నేయెగ్గును లేదు
మీరు విచ్చేసిన మిముఁ బాసి యిచట, నేరుతుమే రిత్తనేలపై నిలువ
పడతులతో నిష్టబంధులతోడఁ, గొడుకులతోఁ గూడ గొల్చి వచ్చెదము.
కరుణింపవలయు నాకాలునిపలుకు, లరసి యల్లన నవ్వి యౌగాక యనుచు
కొడుకుల నీక్షించి కుశునకు నందు, నడగొండ లననొప్పు నాగముల్ వేయు
నిరవొంద నరదము లిరువదివేలు, నరుదారు దురగంబు లరువదివేలు
గణన కెక్కుడు గాఁగ గలధౌతహేమ, మణిభూషణాదులు మనసార నిచ్చి
లవునకు నట్లకా లలినొప్ప నిచ్చి, ప్రవిమలమతి రాజ్యపట్టముల్ గట్టి
మీదేశముల కిఁక మీ రేగు డనిన, నాదాశరథికి వా రర్ధిమై మ్రొక్క
చని రంత రాముఁడు శత్రుఘ్నుకడకు, బనిచె నొక్కని వాఁడు పయనమై వెడలి
మరునాఁడు వేగంబె మథురకు నరిగి, తెఱగొప్ప లక్ష్మణుతెఱ గెఱిఁగించి
జననాథుప్రతినయు జననాథుతోడ, జననున్న యాపురజనులసంతసము
జెలువార పట్టాభిషేకముల్ జేసి, లలి భూములకుఁ గుశలవులఁ బంచుటయు
నొప్పెల్లఁ జెడి పుర మున్నచందంబుఁ, జెప్ప శత్రుఘ్నుండు చిత్తంబు గలఁగి
కడుదైన్యమునఁ గాలగతి విచారించి, తడయకయున్నచో దా నేగుదేర
నింతుల మంత్రులఁ బురోహితుల రావించి, యతివేగమున వారి కావార్తఁ జెప్పి,
పరుషవిక్రముఁడు సుబాహుండు మథుర, బరమధర్మంబునఁ బాలింపనిమ్మ