పుట:రంగనాథరామాయణము - ఉత్తరకాండ.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ్యవనుండు శత్రుఘ్నునకు లవణవిజితులగు రాజులచరిత్ర చెప్పుట

యువనాశ్వపుత్రుఁ డయోధ్యకు రాజు, భువనైకనుతకీర్తి భూరివిక్రముఁడు
మాంధాత యనురాజు మహి నెల్లనృపుల, బంధులదోర్బలప్రౌఢిమై గెలిచి
యమరేంద్రు నిరసించి యతనిసింహాస, నమునందె గూర్చుండి నాక మేలుటకు
నింద్రలోకంబుపై నెత్తి పోఁ బెరిగి, యింద్రాదిసురలెల్ల నెదురుగా వచ్చి
వసుధీశ వలదంచు వారింప దనకు, వశము గాకున్నెడ వాసవుం డనియె
నిలలోన గ్రూరులనెల్ల ము న్నీవు, గెలిచిన మఱి కదా కిన్క మామీద
ధరణిరాజులనెల్ల తగ మున్ను గెలిచి, సురలోకరాజ్యసుఖలీలఁ జేయు
మని కుపితాత్ముడై యమరేంద్రుఁ డనిన, జననాథుఁ డనియె నాశక్రు నీక్షించిఁ
యని నన్ను నెదురించునతఁ డెవ్వఁ డుర్వి, వినుపింపుమనిన నవ్విబుధేంద్రు డలరి
రాజేంద్ర మధువను రాక్షసేంద్రునకు, భూజనద్రోహియై పుట్టెను కొడుకు
లవణుడు నాపాపలాలసుం డగుచు, నవనిపై వర్తించు నధికదర్పమున
నతనికి మధువనం బది యున్కిపట్టు, జితశత్రుఁ డగునిన్ను జీరికిగొనఁడు
నా విని తలవంచి నరనాయకుండు, దేవేంద్రు వీట్కొని తీవ్రకోపమున
మరలి సేనలతోడ మధువనంబునకు, నురువడిఁ జనుదెంచి యొక్కచో నిలిచి
లవణునొద్దకు దూతలకు బంప వారు, జవమున జని వేగ సంగరంబునకు
వడిజని మాంధాత వచ్చినాఁ డనిన, నొడిచి గ్రక్కున మ్రింగె నుగ్రకోపమున
నిది యేల తడసిరో యీదూత లనుచు, మది విచారించి యామాంధాత వచ్చి
యోరోరి నాతోటి యుద్ధంబు సేయు, వే రమ్ము నావుఁడు వెడనవ్వు నవ్వె
కడునల్క బరతెంచి కడిదిశూలంబు, వడినెత్తి యుంకించి వైచె వైచుటయు
మిడుగుర్లు మంటలు మింట నందంద, నడరంగ భటవాహనాదులతోడ
బలువిడి మా౦ధాత భస్మంబు చేసి, వెలుగుచు బరతెంచె వెస పురంబునకు
నని చెప్పి యాశూల మట లేక వాడు, మనుజేంద్రనందన మడియు నీచేత
శూలంబు చేనున్న శూలికినైన, నాలంబులో గెల్వ నలవి గా దతని
నని చెప్పెఁ జెప్పిన నౌగాక యనుచు, నినుడు పూర్వాద్రికి నేగుతెంచుటయు

శత్రుఘ్నుఁడు లవణాసురునిం జంపుట

లవణుఁ డాహారేచ్ఛ లలి వీడు వెడలె, యవనీశుసుతు డంత యమున వేదాటి
బాణబాణాసనపాణియై వెంట, తూణీరయుగ మొప్ప దుర్జయుం డగుచు