పుట:రంగనాథరామాయణము - ఉత్తరకాండ.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బుద్ధిమంతుండవై పుత్ర నీ వుండు, మిద్ధకులాచార మేమర కెపుడు
వాత్సల్యమున సాధువర్గంబు నరియు, వత్స నీ వని పల్కి వసువు బోధించి
వాసవతేజుఁ డావసుమతీనాథుఁ, డూసరివెల్లి యై యొకబొక్కఁ జొచ్చి
పరికింప నేఁడు నాపాపశేషమున, ... ... ... ... ... .... ..... ..... ....
నృగుపాటుఁ జెప్పితి నీకు నింకొక్క, తగుకథ చెప్పెదఁ దమ్ముఁడ వినుము

రాముడు లక్ష్మణునకు నిమిచరిత్రముం జెప్పుట

వసుమతి నిక్ష్వాకువంశంబులోన, నసమానకృతి నిమి యనరాజు గలఁడు
ఆరాజు గౌతమునాశ్రమభూమి, చేరువఁ గమనీయశిల్పంబు లమర
ననిమిషపురిఁ బోలు నన వైజయంత, మనుపేరుగల పురం బమరించి యందుఁ
జెన్నొంద రాజ్యంబుఁ జేయుచు నొక్క, జన్నంబు గావింప జనకాజ్ఞ వడసి
ముదమున నందఱమునుల రప్పించి, పదపడి తగనర్ఘ్యపాద్యంబు లిచ్చి
భృగునంగిరసునత్రి పృథులతేజమున, నెగడు వసిష్ఠుని నెమ్మిఁ బూజించి
మనమార నను నీవు మఖము సేయింపు, మనుచు వరించిన నావసిష్ఠుండు
నరనాథపుంగవ నన్ను నీ విట్లు, వరియించి తింకొక్కవాక్యంబు వినుము
అమరంగఁ దను జేయు నధ్వరంబునకు, నమరాధిపతినన్ను నధ్వర్యు గాఁగ
నీమఖ మేన చేయించెద ననుచు, నామునీంద్రుఁడు పోయె నమరేంద్రపురికి
నాతపస్వులతోడ నంత నానిమియు, గౌతము వరియించి గడుసంతసమునఁ
జలికొండ కబ్ధికిఁ జక్కమధ్యమునఁ, బొలుపొంద నొకపుణ్యభూతలంబునకు
జనుదెంచి యచ్చోట సకలలోకములు, వినుతింప గౌతము విధివంత మమర
నైదువేలేఁడుల యందాక నిఖిల, భూదేవతలు నిలింపులు తుష్టిఁ బొంద
విలసితరత్నాదివివిధదానములఁ, జెలువార జన్నంబు సేయించుచుండ
నమరేంద్రుచే జన్న మట వసిష్ఠుండు, సమకొని యేనూఱుసంవత్సరంబు
లంచాకఁ జేయించి యది దీర్చి మరలి, సందీప్తతేజుఁడై చనుదెంచి యచట
నక్షపారునిచేత నర్హసత్కార, మక్షీణవిధియుక్తి నంగీకరించి
యినవంశగురుఁడనై యే నుండ నొండు, మునిచేతఁ జేయించి మూర్ఖుఁడై మఖము
నిమిగర్వమంతయు నేఁడు వారించి, నిమిషంబులో నంచు నిమిఁ గానవచ్చు
దౌవారికునిఁ జూచి తనరాక నీదు, భూవరు కెఱిఁగింపఁ బొమ్మన్న నతఁడు
పవ్వళించినవాఁడు పతినాగఁ దొలఁగి, దవ్వుగా నొక్కింతతడవు గూర్చుండి
యేను వాకిట వచ్చి యిట్లుండ లోన, మే నెఱుంగఁడొ గాక మేలు గా కనుచు