పుట:రంగనాథరామాయణము - ఉత్తరకాండ.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నందంద పెక్కేఁడు లరసి యాగోవు, నెందుఁ గానక యమ్మహీసురోత్తముఁడు
కనఖలం బనుపేరు గలదేశమునకుఁ, జని యట నొకవిప్రుసదనంబునందుఁ
దనగోవుఁ గని సమదంబున “శబళ!”, చనుదె మ్మనుచు నిజస్వరముఁ జూపుటయ
నెలుఁగున నొడయుఁగాఁ నెఱిఁగి మో మెత్తి, పిలిచిన యావిప్రుపిఱుఁద న ట్లరుగఁ
దన్ను నానృపుచేతఁ దగఁ బరిగ్రహము, గొన్నబ్రాహ్మణుఁడును గూడ నేతెంచి
దానము నృగుచేతఁ నేను గొన్నాఁడఁ, గాన నాగో విది గాదు నీసొమ్ము
నావుడు నొకనవ్వు నవ్వి యావిప్రుఁ, డేవిధంబున నీకు నిది యేల దక్కు
నీకు నిచ్చినయట్టి నృగుడు దా నుండ, నీకు నాకును నేల నెరిగానివాదు
నృగు కెఱింగింత మానృగుమాట మనకు, నగునంచు నొడఁబడి యావిప్రు లరిగి
నగరివాకిటఁ బెక్కునాళ్ళును నిలిచి, జగడమాడుచు నవసరము లేకున్న
వేసరి కనలి యావిప్రు లారాజు, నూసరవెల్లియై యొకబొక్కఁ జొచ్చి
యొగి పదునెనిమిదియుగములదనక, తెగకుండునందాఁక దృష్టింపఁబడక
యాగొంది నుండుగా కని శాప మిచ్చి, యాగోవు విడిచి వారటు వోవుచుండి
వసుదేవుకడుపున వసుధ నావిష్ణుఁ, డసమానగతిఁ గృష్ణుఁ డనఁగ జన్మించు
నటమీఁద నీశాప మవ్వాసుదేవు, పటుదయాదృష్టిచేఁ బాయుఁగా కనుచు
మరలి వా రాత్మీయమందిరంబులకు, నరిగిరి నా విని యారాజసుతుఁడు
జననాథ విప్రులు శపియించి చనిన, వెనుక వర్తించినవిధ మెట్టి దనిన
విను సుమిత్రాపుత్ర విప్రశాపంబు, విని భీతి నారాజు విహ్వలుం డగుచుఁ
దనకు నయ్యెడుకష్టదశ విచారించి, తనమంత్రులాదిగా తగువారినెల్లఁ
దడయక రావించి తనపుత్రు వసువుఁ, గడువేగఁ బట్టంబు గట్టుండు ధరకు
చలికి నెండకు వానజడికి నెచ్చోటు, వలనుగా దచ్చోటు వలనొప్పఁజేసి
యక్కడనక్కడ నధికయత్నముల, బొక్కలు సేయుఁ డాబొక్కలలోనఁ
జరియింతు విప్రులు శపియించినట్లు, పొరి నాకుఁ గుడువక పోవ దాఫలము
సాగి బొక్కలఁ గప్పి చరియింప నాకుఁ, దీఁగెలు వృక్షముల్ తిరిగిరా నిడుఁడు
చల్లఁగాఁ దావులు జల్లు క్రొవ్విరులు, చల్లుఁడు బొక్కలు సవరగాఁ జేసి
యారసి రెండుమూఁడామడమేర, మీఁదట నెవ్వరి మెలఁగనీకుండ
కడువేగ నిప్పని గావింపవలయుఁ, దడయరాదని పల్కి తనపుత్రుఁ జూచి
జనులవిన్నపములు సతతంబు వినుము, తనయ నీతిస్థితి ధరణి పాలింపు
తనకర్మఫలమెందుఁ దప్పదు గాన, మనమున నాకుఁగా మరుగంగవలదు