పుట:రంగనాథరామాయణము - ఉత్తరకాండ.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీత నుపేక్షించి చేసినతెంపు, చేతోగతంబులై చేడ్పాటుఁ బెనుప
నలఁతఁ బొందుచునున్న యారామునంఘ్రి, జలజంబునకు మ్రొక్కి జననాథసుతుఁడు
ధరణీశునంఘ్రులు దనమస్తకంబు, వరుస నొండొరునశ్రువారిచేఁ దడియ
వడిసెడుకేల నావశుధేశుఁ డప్పు, డడలువారించుచు ననుజన్ము నెత్త
నొక్కింతతడవున కొనరు గద్గదిక, చిక్కుకంఠాంతరసీమలో నణఁగ
దేవ భాగీరథీదేవి దాటించి, దేవరయాజ్ఞఁ దత్తీరదేశమునఁ
గల్మషేతర సీతఁ గళ్యాణచరిత, వాల్మీకియాశ్రమవనసమీపమున
మీవాక్య మెఱిఁగించి మిథ్యాపవాద, మేవిధంబునఁ బాయ దీవేంటఁదక్క
నటుగాన నీ వింక నడలకు మనుచు, నట డించి వచ్చితి నని పల్కెఁ బలికి
సుఖము దుఃఖమును శుభమును గీడు, నఖిలలోకులకుఁ గర్మానురూపమున
నధిప వర్తించు నయ్యైకాలగతుల, నిధులును జెడిపోవు నిత్యముల్ గావు
అనఘ యెంచఁగ సర్గ మందుట చాల, మనుట విచారింప మరణంబుకొఱకు
నిను నీవు గెలుచుట నిఖిలంబు గెలుపు, మనుజేంద్ర శోకంబు మదిలోన నుడుగు
పురుషపుంగవులైన పుణ్యాత్ము లెందుఁ, బరికింప మూఢులై పడరు బంధముల
నీ వేమి సామాన్యనృపతివే దేవ, నావుడు ధృతిఁ బూని నరనాథుఁ డనియె
జననాథతనయ నీసత్యవాక్యములు, విని సంతసిల్లితి విలసిల్లె మనము
తెఱఁ గేది నాలుగుదివసంబు లేని, మఱచినారము మహిమండలస్థితులు
ప్రజలవిన్నపములు పరిపాటి వినుచుఁ, బ్రజలఁ బాలించుట పరమధర్మంబు
ఎలమి మంత్రులఁ బురోహితులవిన్నపము, గలవారిఁ బిలిపింతు గాక కొల్వునకు
దుష్టనిగ్రహమును దోషంబు నణఁచి, శిష్టరక్షణమును జేయక యెవఁడు

రాముఁడు లక్ష్మణునకు నృగచరిత్రముం జెప్పుట

భూభారబోగంబు భోగించు నాతఁ, డాభీలగతిఁ బొందు నధమలోకముల
నీయర్థమునఁ దొల్లి యితిహాసమొకటి, పోయినయది విను భూపాలతనయ
సత్యసంధుఁడు నగ్రజన్మప్రియుండు, నిత్యకీర్తియు నైన నృగుఁడను రాజు
పుష్కరక్షేత్రంబుఁ బొంది సత్కర్మ, పుష్కరం బను నొక్కపుణ్యకాలమున
నెలమిఁ గ్రేపులతోడ హేమశృంగాదు, లలవడ రచియించి యగ్రజన్ములకు
నొకకోటిగోవుల నుల్లంబు లలర, నకలంకగతి దాన మమరంగ నిచ్చె
ననఘ తపోమూర్తి యగు నగ్నివైశ్యుఁ, డను విప్రపుంగవునావు ముం దప్పి
ఘనమైన యారాజుకదుపులోఁ గలసి, యునికిఁ దా నతఁ డిచ్చె నొక్కవిప్రునకు