పుట:రంగనాథరామాయణము - ఉత్తరకాండ.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నరుదైన దయపుట్టె నటుగాన మీరు, పరమేశ యీబాలుఁ బాలింపవలయు
నని విన్నవించిన నప్పుడు వాని, కనుపమస్థితిఁ దల్లి యంతప్రాయంబు
నమరత్వమును నిచ్చె నమ్మహాదేవుఁ, డమరఁ గర్భంబున నపుడ జన్మంబు
తమ సవితృలపాటిదగువయఃస్థితులు, నుమయును వర మిచ్చె నొగి రాక్షసునకు
నంత సుకేశాఖ్యుఁడై వాఁడు జనని, యంతప్రాయమున వాఁ డమరుఁడు నగుచుఁ
బురుహూతమహిమతో భువనంబు లద్రువ, వరగర్వమునఁ క్రొవ్వి వర్తించుచుండ
గ్రామణియనుపేరి గంధర్వుఁ డతని, సామర్థ్య మూహించి సమ్మదం బెసఁగ
వరరూపవతి వేదవతియనుకన్యఁ, బరఁగంగ నతనికిఁ బత్నిఁగా నిచ్చె
లీల నాతఁడు సుమాలిని మాల్యవంతు, మాలిని గనియె నమ్మత్స్యాక్షివలన
మూఁడగ్నులను రుద్రు మూఁడునేత్రముల, మూఁడుమంత్రంబుల మూఁడువాయువులఁ
బోలి యామువ్వురుఁ బొలుపార మేరు, శైలంబునకు నేగి సకలలోకములు
భయమందఁ దపములు పరమేష్ఠిఁ గూర్చి, నియతితోఁ జేయంగ నీరజాసనుఁడు
కనకాద్రి కేతెంచి ఘనులార! వేఁడి, కొనుఁ డేమివరములు కోర్కి మీ కనిన
ముగురు విచారించి ముకుళితహస్తు, లగుచు వా రతిభక్తి నాబ్రహ్మఁ జూచి
యెనసి మే మన్యోన్యహితులమై యుండ, వినుతతేజంబుల విలసిల్లుచుండ
నరుల కజేయులమై యుండనిమ్ము, చిరజీవులై యుండఁ జేయుము మమ్ము
ననిన నవ్వరములు నబ్జజుఁ డొసఁగి, తనలోకమున కేగెఁ దదనంతరంబ
వారిజసనదత్తవరశక్తిఁ జేసి, వారును ముదమంది వారింపఁబడక
ననిమిషుల్ మొదలుగా నఖిలలోకముల, జనులఁ బాధించుచు జనలోకనాథ!
దుర్మదచరితు లాదుర్జయుల్ విశ్వకర్మయొద్దకు వచ్చి మనుఁడ నేర్పెసఁగ
నీవు నివాసముల్ నిర్మింతు సకలదేవతాగంధర్వదితిసుతాదులకు
మాకు నింపెసఁగంగ మంథాద్రిపైన, శ్రీకిఁ బట్టగు హేమశిఖరిపైనైన
హిమవంతముననైన నెల్లసంపదలఁ, గమనీయరచనలు గలపట్టనంబు
నిర్మింపు నీ వన్న నెరయంగ విశ్వ, కర్మయు వారితోఁ గరమర్థిఁ బలికె
వినుఁడు పురాతనవృత్తాంత మొకటి యనఘుండు నారదుఁ డఖిలలోకములుఁ
దిరిగి యొక్కెడ వాయుదేవుని గాంచి, యరుదార నతనితో ననియె నీరీతి
ని న్నొక్క టడిగెద నిక్కంబుఁ జెప్పు, మిన్నిలోకములకు నెక్కుడు బలము
గలవారు వీ రని గణుతింపుమనిన, నలరుచు నిట్లను నాగంధవహుఁడు
త్రిగుణాత్మకమ్మైన దేదీప్యమైన, ముగురువేలుపులకు మొగ యాకసంబు