పుట:మార్కండేయపురాణము (మారన).pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదాలసావివాహము

ఆ.

అట్ల కాక యనుడు నపుడు మదాలసా, పితృకులైకగురుని హితుని భక్తి
తోడఁ దలఁచెఁ దుంబురుఁ గుండల, యాక్షణంబ యతఁడు నరుగుదెంచి.

319


వ.

సముచితంబు లగుమంగళాచారంబు లొనరించి.

320


చ.

అనలము ప్రజ్వలించి విహితాగమతంత్రము లాచరించి పెం
పొనరఁగ యుక్త మగుహోమము మున్నొనరించి తుంబురుం
డనఘుఁడు సేయఁగాఁ గువలయాశ్వుఁడు పెండిలి యయ్యెఁ బ్రీతి న
త్యనుపమరూపయౌవనమదాలసమానస నమ్మదాలసన్.

321


వ.

ఇ ట్లయ్యిరువురకుఁ బరమోత్సవంబునం బరిణయంబు చేసి తుంబురుండు నిజతపో
వనంబున కరిగెఁ గుండలయును దీర్థంబు లాడఁ జను కుతూహలంబున వినయా
వనతయై కువలయాశ్వున కి ట్లనియె.

322

కుండల తపమొనర్చి దివ్యగతి కేగుట

క.

చతురుండవు నయధర్మా, న్వితుఁడవు సద్బుద్ధి విట్టినీకు ననఘ! పం
డితజను లైనను నేరరు, హిత ముపదేశింప నేర్తురే యెలనాగల్.

323


క.

ఐనను నెచ్చెలిదెస మది, నూనిన నెయ్యమునఁ జేసి యుడుగక బుద్ధు
ల్నా నేర్చినట్లు సెప్పెద, మానుగ మీ కేను వినుఁడు మగువయు నీవున్.

324


సీ.

పతి ప్రయత్నంబుతో భార్య భరించుచుఁ గీ డొందకుండ రక్షింపవలయు
నవిరోధవృత్తి ధరార్థకామములు భార్యానుకూలతఁ బతి కతిశయిల్లు
భార్యావిహీనతఁ బతికి వర్గత్రితయంబులో నొక్కటి యయిన లేదు
దేవపిత్రతిథిపూజావిధు లొనరింప భార్యయ పతికి నుపాశ్రయంబు


తే.

మగఁడు వెలిగాఁగ సతికి ధర్మంబు ధనము, గామమును మున్న లభ్యము ల్గావు గాన
దంపతులు పరస్పరవశతాప్రమోద, మగ్నమానసు లై కూడి మనుట యొప్పు.

325


వ.

అని బహుప్రకారంబుల భర్తృభార్యాధర్మంబులు చెప్పి.

326


క.

మనుజేంద్రతనయ! నీవును, వనితారత్నంబుఁ గూడి వైభవలీలన్
ధనతనయాయుర్యుతు లై, మనుఁ డని దీవించి యక్కుమారుని నెలమిన్.

327


వ.

వీడుకొని మదాలసం గౌఁగిలించుకొని కుండల దివ్యగతిం జనియె నంత.

328

మదాలసం దెచ్చునపుడు మార్గమునఁ గువలయాశ్వునకు రాక్షసులతోడి యుద్ధము

శా.

ధీరోదాత్తుఁడు శత్రుజిత్తనయుఁ డద్దివ్యాశ్వమున్ దాను నా
నీరేజాక్షియు నెక్కి యయ్యతలము న్నిశ్శంకత న్వెల్వడం
బ్రారంభించినఁ గాంచి కొంద ఱసుర ల్పాతాళకేతుండు పెం
పారం దెచ్చినకన్య వీఁ డొకఁడు శౌర్యస్ఫూర్తిఁ గొం చేఁగెడున్.

329


క.

అని యాక్రోశించుచు వెసఁ, జని చెప్పిన దనుజవిభుఁడు సంధ్యారుణలో
చనదంతతాడనోగ్రా, స్యనితాంతామర్షభీషణాకారుం డై.

330


వ.

రయంబున వెలువడి.

331