పుట:మార్కండేయపురాణము (మారన).pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దలరి మనంబులోన ధృతి దర్పకవీరుని యేయుపువ్వుఁదూఁ
పులఁ బొరివోయినం గలఁగి పొల్తుక యెంతయు వీతలజ్జయై.

298


తే.

తనవిలోచనమధుకరద్వయము గరము, దమకమున నక్కుమారుసౌందర్యమధువుఁ
గ్రోలికొనఁగ మెచ్చులు మదిఁ గీలుకొనఁగ, నంబుజాస్య శిరఃకంప మావహిల్ల.

299


క.

ఈరమణీయకుమారుఁడు, మారుఁడొ యక్షాధిపతికుమారుఁడొ పౌలో
మీరమణకుమారుఁడో రుచి, రోరగనాయకకుమారుఁడో తలపోయన్.

300


వ.

అని తలంచుచు నమ్మగువ మదనాతిరేకంబున వెచ్చనూర్చి మూర్ఛపోయి పడినఁ
దదీయవయస్య శిశిరజలసేచనమృదువ్యజనవీజనంబుల దానిసేద దీర్చినంజూచి
కువలయాశ్వుం డి ట్లనియె.

301


క.

అతివా నీ విమ్మెయి మూర్ఛిత వగుటకు నేమికతము చెప్పు మనుడు నా
సతి లజ్జాదై న్యసమన్వితలలితాపాంగదృష్టి నెచ్చెలిఁ జూచెన్.

302


తే.

చూచుటయు రాజనందనుఁ జూచి బోటి,
యిట్లనియె నిన్నుఁ జూచి యీయిందువదన
పారవశ్యంబు నొందినకారణంబు, దీనివృత్తాంతమును విను దేటపడఁగ.

303

కుండల యనుసఖి కువలయాశ్వునితో మదాలసావృత్తాంతము చెప్పుట

సీ.

విశ్వావసుం డన వెలసినగంధర్వరాజుతనూజ యీరాజవదన
పేరు మదాలస యారామమునఁ గేలి యొనరించుచుండఁగ నొక్కనాఁడు
పాతాళపతి యైనపాతాళకేతుఁ డన్పాపురక్కసుఁ డేపు మిగిలి
మాయాబలమున నీమానినిఁ గొనివచ్చి యిచ్చట నునిచి యీవచ్చురేయి


ఆ.

ననఘ తా వరింతు నని నిశ్చయముఁ జేసి, యుత్సవంబుతోడ నున్నవాఁడు
వాఁడు దగినవరుఁడె వనజాయతాక్షికి, నకట శ్రుతికి శూద్రుఁ డర్హుఁ డగునె.

304


చ.

దనుజునిఁ బొంద రోసి వనితామణి పోయినరేయిఁ జావఁ జూ
చినఁ గృపపెంపున న్సురభి చెప్పెఁ దలోదరి భర్త గాఁడు నీ
కు నసుర మర్త్యలోకమునకు న్జనిన న్వడి నెవ్వఁ డే
యు నతఁడు సుమ్ము భర్త యగు నూఱడు మింతయు శీఘ్ర మయ్యెడిన్.

305


వ.

అని చెప్పిన నిప్పడంతి మరణవ్యవసాయనివృత్త యయ్యె నేనీతలోదరి చెలికత్తియను
గుండల యనుదాన వింధ్యవంతునికూతురఁ బుష్కరశాలిభార్య నతండు
శుంభుండను రాక్షసుచేత మృతుం డైనం బరలోకార్థపుణ్యతీర్థంబులకు దివ్యగతి
నరుగుచు నొక్కచోట సూకరాకారుం డైనపాతాళకేతుండు మునిజనత్రాణపరా
యణుం డైనయొక్కరాజకుమారునిచేత నేటువడి పఱతేరం గనుంగొని యత్తెఱం
గరయం దలంచి వాని వెనుకనే మరలి యిచటి కరుదెంచితి నిమ్మచ్చెకంటి మూర్ఛకుం
కారణం బాకర్ణింపుము.

306


తే.

చూడ్కులకుఁ జిత్తమున కింపు సొం పొనర్చుచున్న మన్మథమూర్తి వీ వుండ నింక
నసురు నేసిన యన్యుని కాల నగుదు, నొక్కొ యని తల్లడంబున నువిద సొగసె.

307