పుట:మార్కండేయపురాణము (మారన).pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ర్యావష్టంభసురేంద్రుఁడు, శ్రీవిలసితమూర్తి పుణ్యశీలుఁడు జగతిన్.

255


తే.

రాచకొడుకులు దాను నారాసుతుండు, వేడ్కతోఁ గూడి బహువిధవిహరణములు
సలుపుచుండఁ గృతార్థు లై సకలవిప్ర, రాజవైశ్యకుమారులు రమణతోడ.

256


వ.

అక్కుమారునికడ కరుగుదేరం దొడంగి రంత నొక్కనాఁ డహిలోకంబుననుండి.

257


చ.

తరుణులు రూపవంతులు సుదర్శను లశ్వతరాత్మజన్ము లా
నరపతిపుత్రుతో విహరణం బొనరించుకుతూహలంబునన్
ధరణిసురాకృతు ల్వెలయఁ దాల్చి ఫణీంద్రకుమారు లేఁగుదెం
చి రిరువు రిద్ధతేజులు విశిష్టజనస్తవనీయవర్తనుల్.

258


ఆ.

అట్లు వచ్చి భూసురాత్మజవైశ్యకు, మారవరులతో విహారలీల
లర్థిఁ జలుపుచున్న యహిరాజతనయులఁ, గాంచి నృపసుతుండు గారవమున.

259


క.

నెచ్చెలులంగాఁ గైకొని, మచ్చిక వెలయంగ నక్కుమారులు దాను
న్నిచ్చలు వివిధవిహారము, లచ్చుపడ న్జలుపుచు న్బ్రియం బలరారన్.

260


మ.

పొలుపుగ మజ్జనాంబరవిభూషణచందనమాల్యభోజనా
దిలలితభోగలీలల సుదీర్ణరసాన్వితగీతవాద్యవి
ద్యల బహుకావ్యనాటకకటాక్షవినోదముల న్గజాశ్వశి
క్షల వివిధాస్త్రశస్త్రనయశాస్త్రపరిశ్రమనైపుణంబులన్.

261


క.

పరిహాసవచనరచనల, సరసకళాభ్యసనముల నజస్రము మైత్రి
పరిణతి వెలయఁగను ఫణీ, శ్వరతనయులతోడఁ గూడి వారని వెడ్కన్.

262


తే.

తగిలి ప్రొద్దులు పుచ్చుచు ధరణినాథ, తనయుఁ డధికప్రమోదతత్పరత నొందె
నర్థిఁ బాఁపకొమాళ్ళును నతనితోడి, యాట లుల్లంబులకుఁ బ్రీతి యావహింప.

263


వ.

పగలు వినోదించి రాత్రి రసాతలంబున కరుగుచు నివ్విధంబున ననుదినంబును వర్తిం
పుచుండ నొక్కనాఁ డశ్వతరుండు పుత్రులం గనుంగొని.

264


క.

మనుజభువనంబునం దెవ్వనితోడం గూడి యాడువాంఛానిరతి
న్జనియెద రేఁ బాతాళం, బునఁ బెక్కుదినంబు లేనిఁ బొడగాన మిమున్.

265


సీ.

అని తండ్రి యడిగిన నయ్యహిదారకు ల్మ్రొక్కి కరంబులు మోడ్చి వినయ
మెలరార ని ట్లని రిల శత్రుజిన్మహీధవునిసుతుండు ఋతధ్వజుండు
రూపవంతుం డార్జవోపేతుఁ డతులశౌర్యాభరణుండు ప్రియంవదుండు
విద్యావిదుఁడు బుద్ధివినయాభిమానలజ్జాన్వితుం డధికసఖ్యప్రియుండు


ఆ.

వేడ్క నతఁ డొనర్చు వివిధోపచారవి, న్యాసముల మనంబు లలరుచుండు
మాకు నిందు నొండులోకంబునందును, నంతప్రీతి పుట్ట దహికులేంద్ర.

266


వ.

అని చెప్పిన నయ్యహికులేశ్వరుం డనురాగిల్లి.

267


క.

అరయఁగ నెవ్వనిపుత్రుఁడు, పరోక్షమున నిట్లు పొగడఁబడు సతతము స
త్పురుషులచే నమితగుణో, త్తరుఁ డై యాతండు ధన్యతముఁడు తలంపన్.

268