పుట:మార్కండేయపురాణము (మారన).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొనరించెను. మరుత్తునిపుత్రుఁ డగునరిష్యంతునియొక్కయుఁ బౌత్రుఁ డగుదమునియొక్కయుఁ గథల మారనకవి తెలిఁగింపలేదు.

మొత్తమున మారనకవి యాంధ్రీకరణము భారతాంధ్రీకరణముకంటె మూలమునకుఁ జేరువగ నుండును. ఆవిషయ ముభయగ్రంథములఁ బఠించిన ద్యోతకము కాఁగలదు మారనకవి భావోద్రేకము గలచోటుల నతివ్యాప్తిగఁ గథల కందని వర్ణన వ్రాయువాఁడు కాఁడు గాన నీతనికథాప్రణాళిక శ్లాఘనీయముగ నున్నది. ప్రౌఢకవిమల్లన రుక్మాంగదచరిత్రములో మారనకవి నరకవర్ణనమునే యనుసరించుటయు, నల్లసాని పెద్దనార్యుఁడు మనుచరిత్రమున మార్కండేయపురాణము ననుసరించుటయు నీకవివర్యుఁడు కవిజనసంభావ్యకవితావిభాసురుఁ డని తెలుపును మారన కవితాచాకచక్యము, కథాకల్పనము, భావనాప్రదీపనముఁ గాంచఁ దలంచిన, ద్వితీయాశ్వాసమునందలి కౌశికునిభార్య పాతివ్రత్యమహిమముఁ బఠించినఁ జాలును వర్ణనాసందర్భమునఁ బాత్రపోషణమున మారన యసాధారణుఁడు మారన కథాభాగములోని దుఃఖరసపద్యములు భారతస్త్రీపర్వములోని తిక్కనసోమయాజి పద్యములకు గురుశిష్యన్యాయముఁ జూపును పరిశీలింపుఁడు.

చ.

ఉరగము చేతఁ జచ్చినతనూద్భవునిం గొని శోకవేదనా
పరవశయున్ వికీర్ణకచభారయు నుద్గతబాష్పపూరయున్
గరతలతాడితాస్యయును గద్గదికావికలార్తనాదయున్
జరణవిపర్యయాపగతసత్వరయానయు నై పొరిం బొరిన్.

లోహితాస్యునిఁ గాంచినప్పటి హరిశ్చంద్రగేహినిస్థితి మారనకవి యెంత శ్రావ్యముగ నెంత నైజముగ నెంత ప్రత్యక్షముగ నెంత తాద్రూప్యముగ వాకొనేనో పరిశీలించిన రసజ్ఞులకు మారనకవి కవితాపీఠమున నెట్టియుత్తమస్థాన మలంకరింపఁదగువాఁడో తెలుపఁ బనియుండదు.

ఉ.

బోరనఁ బొంగి శోకరసపూరము నిర్భరబాష్పపూరము
ల్వారక కన్గవం దొఱఁగ వాతెఱలాలలు గ్రమ్ముదేఱ హా
హారవముల్ సెలంగ విరియం బడి వేనలి ధూళిబ్రుంగ న
క్కూరిమిపట్టిఁ బేర్కొనుచుఁ గోమలి మేదినిఁ జేతులూఁదుచున్.

ఈపద్యపటమునఁ జిత్రిత లైన హరిశ్చంద్రగేహినుల నంతరంగదృష్టితో బరిశీలించినఁ దత్కాలోచితసహజస్థితులు కనులముందు నటించినటు లుండును. “కంఠస్తంభితబాష్పవృష్టికలుషః చింతాజడం దర్శనం” అను నభిజ్ఞానశాకుంతలములోని కణ్వవచనమునకు “శోకరసపూరము నిర్భరబాష్పపూరముల్ వారక కన్గవం దొరఁగ” యను మారనకవివచనము మెఱుంగుఁబెట్టుచున్నది. కావ్యోచితము లగుసుగుణము లీమారనకవి గ్రంథమున నెన్నియో గలవు కవిజనసమాదరణీయములగు నీసుగుణముల వాకొనుటకంటెఁ బాఠకలోకమునకే యాభారము వదలుట యుక్తము.