పుట:మార్కండేయపురాణము (మారన).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సరస్వతిపత్రికలో నీగ్రంథము తొలుత ముద్రింపఁబడినది. దాని నాధారము చేసికొని ముద్రించుటచేఁ బూర్వముద్రితప్రతియందుఁ గొన్నిదోషములు పడినవి. తాళపత్రగ్రంథసహాయమునను బదునాల్గవశతాబ్దము నాఁటి యాంధ్రభాషానియమముల ననుసరించియుఁ గవ్యభిప్రాయానుసారములగు పాఠములను గ్రహించి ముద్రణస్ఖాలిత్యములు ఇతరదోషములు సవరించి ప్రతిని ద్వితీయముద్రణమునకు శ్రమమీఁద సిద్ధపఱుపఁగలిగితిమి. పరగ యనుపదము సార్ధబిందుకమని శబ్దరత్నాకరకారు లొక యుదాహరణము మార్కండేయపురాణము నుండి యొసంగి యున్నారు. ఆ యుదాహరణము పద్యభాగ మీగ్రంథమునఁ గానరాదు శాసనములందు ఇతరకవుల ప్రయోగమునందు పరగపదము బిందురహితముగాఁ గనుపట్టుచుంటచే నిందారూపమునే తీసికొంటిమి. ఎఱ్ఱాప్రగడ హరివంశములు బ్రదుకు అనుపదము రెండుతావులఁ బ్రాసలోఁ బ్రయోగించెను మారన యొకచోటఁ బ్రయోగించెను పూర్వకవులలోఁ బలువురు బ్రదుకు అనురూపమును దీసికొని యున్నారు. బ్రతుకు ఆధునిక రూపము. కొన సర్వత్ర బ్రదుకు అనియే యుంచితిమి. ఇటులె యాధునికపరిశోధకుల మతము ననుసరించి కొన్ని చోటుల స్వల్ప సంస్కరణములఁ గావించితిమి. గుణదోషములు పాఠకులు గ్రహింపఁగలరు.

నందిగామ

ఇట్లు, భాషాసేవకులు,

1.7.27.

శేషాద్రిరమణకవులు, శతావధానులు