పుట:మార్కండేయపురాణము (మారన).pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రించుచుండె నంతఁ గొంతకాలంబునకుఁ గృతవీర్యుం డనుమహీపతి పరలోకగతుం
డైన నతనితనయుం డర్జునుండు నిజాభిషేకార్థం బరుగుదెంచిన మంత్రిపురోహిత
పౌరజనంబులం జూచి నరకోత్తరం బైనయీరాజ్యంబు నేఁ జేయ నొల్ల వినుండు.

212

కార్తవీర్యార్జునవృత్తాంతము

సీ.

పరనృపతస్కరబాధలు లే కుండఁ దమ్ముఁ గాచుటకునై ధరణిపతికి
ద్వాదశాంశధనంబు వాణిజ్యపరులు గోపాలకర్షకులు షడ్భాగగవ్య
ధాన్యంబు లిత్తురు తప్పక యజ్ఞనావలుల రక్షింపఁగ వలను లేక
యవనితలేశ్వరుం డప్పాళు లూరక హరియించి దస్యునియట్ల ఘోర


తే.

నరకమునఁ బడు భూవహనమున కిప్పు, డే నశక్తుండఁ గావున నే వనమున
కరిగి తప మాచరించి యధ్యాత్మయోగ, సిద్ధిఁ బొందెద నని యర్థిఁ జెప్పుటయును.

213

గర్గకార్తవీర్యసంవాదము

తే.

అతనిమనమునందలినిశ్చయం బెఱింగి, గర్గుఁ డనుమంత్రి యి ట్లనుఁ గరము నెమ్మిఁ
దపము సేయంగ నీ విట్లు విపినమునకుఁ, జనియె దేనియుఁ జెప్పెద మనుజనాథ!

214


క.

హరి దత్తాత్రేయుం డన, ధరణి నవతరించి యోగతత్పరుఁడును ని
ర్జరమునిసేవితుఁడును నై, పరగుచు నున్నాఁ డతని నుపాసింపు నృపా!

215


క.

అనిమిషపతి యసురులచేఁ, దనరాజ్యముఁ గోలుపోయి తా నయ్యోగీం
ద్రుని నారాధించి మగుడ, దనుజుల నిర్జించి నిజపదస్థితి నొందెన్.

216


వ.

అనిన నర్జునుం డి ట్లనియె.

217


ఆ.

అసురవరులచేత నమరేశ్వరుం డెట్లు, గోలుపోయెఁ దనవిశాలలక్ష్మి
నమ్మునీంద్రు నెట్టు లారాధనము సేసె, మగుడ నెట్లు రాజ్యమహిమ వడసె.

218


వ.

అని యడిగినం గార్తవీర్యార్జునునకు గర్గుం డి ట్లనియె.

219


శా.

జంభాదిప్రకటాసురప్రకరము ల్శక్రాదిదేవాలియు
న్శుంభద్విక్రమకేళిలీల లెసఁగ న్సోమించి యేకాబ్ద ము
జ్జృంభోత్సాహము లుల్లసిల్లఁగ జయశ్రీలోలత న్బోర సం
రంభం బేది నిలింపు లోడి రసురవ్రాతాస్త్రభిన్నాంగు లై.

220


తే.

అమరు లట్లోడి వాలఖిల్యాదిమునులుఁ, దారు గురునిపాలికిఁ జని దైత్యవరుల
నోర్చుతెఱఁగు విచారించుచుండ వారి, కెలమి మిగుల బృహస్పతి యిట్టు లనియె.

221


మాలిని.

అతివికృతచరిత్రుం డత్రిపుత్త్రుండు యోగ
స్థితినిరతుఁడు దత్తాత్రేయుఁ డవ్విష్ణుమూర్తి
న్సతతము నతిభక్తి న్వత్సలుంగా భజింపుం
డతఁ డసురకులఘ్నోద్యద్వరం బిచ్చు మీకున్.

222