పుట:మార్కండేయపురాణము (మారన).pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జూచి యొత్తిలి నవ్వుచు నంబిక వానిశిరంబు గరవాలంబున నఱికిన నతండు
పుడమిం బడియె నప్పుడు సింహఖరనఖరదంష్ట్రాంకురవిదారణవిహరణంబులను గాళిక
కరాళకరవాలవిదళనఖేలనంబులను శివదూతినిశాతహేతిపాతవినోదంబులను
గౌమారిశితభయంకరశక్తిప్రహారవిహారంబులను మాహేశ్వరిమహితత్రిశూలా
భీలహననలీలలను వారాహిప్రచండతుండఖండనహేళనంబులను వైష్ణవినిర్వ
క్రచక్రవిక్రమక్రీడలను మాహేంద్రిమహనీయకులిశధారానికర్తనమర్దనంబు
లను బ్రహ్మాణిమంత్రపూతకమండలుజలక్షేపణాటోపంబులను సంగరాంగణం
బునం గపాలంబులు పగిలియు ఫాలంబులు నొగిలియుఁ గరంబులు త్రెస్సియు
నురంబులు హ్రస్సియు మెడలు దునిసియుఁ దొడలు మురిసియుఁ గండలు రాలియు
గుండెలు గూలియు రూపు లడంగియు నేపులు మడంగియు నేకక్షణంబున నాక్ష
ణదాచరప్రకరంబు సంక్షయంబు నొందె నట్టియెడ శుంభుండు ప్రాణసదృశుం
డగుతమ్ముండు నిశుంభుండును సకలసైన్యంబులు సమసినం జూచి కోపించి యంబి
కకు నిట్లనియె.

206


క.

ఒరులభుజబలముప్రాపున, దుర మొనరించెదవు గాక దోర్బలలీలా
స్ఫురణము నీ కెక్కడి దు, ద్ధుర మగుగర్వంబు విడువు తోయజవదనా!

207

శాంభవి శుంభుం జంపుట

తే.

అనిన దేవి జగత్త్రితయంబునందు, నే నొకర్తన కాని నా కితర మైన
మూర్తి యెందు నెపుడు లేదు మూర్ఖ! చూడు, మద్విభూతులు నాయందు మగుడఁ జొచ్చె.

208


వ.

అని పలికినఁ బ్రహ్మాణీప్రముఖదేవీసముదయం బంబికదేహంబునంద లయంబు నొంది
నం జండిక యొక్కతియె నిలిచి యే మదీయవిభూతిం జేసి పెక్కురూపంబులు ధరి
యించితి నిప్పు డన్నియు నుపసంహరించి నేనొకర్తనై యున్నదాన దానవా
ధమా! నీ వింక నెందుఁ బోయెదు సుస్థిరుండ వగు మనియె నంత నయ్యిరువు
రకును దేవదానవులు చూచుచుండం ద్రిభువనదారుణం బైనరణం బయ్యె
నవ్విధం బాకర్ణింపుము.

209


సీ.

అంబిక వెస నేయునమితదివ్యాస్త్రంబు లణంచె శుంభుండు ప్రత్యస్త్రనిహతి
నతఁ డడరించునానాస్త్రశస్త్రములు హుంకారరవంబునఁ గ్రాఁచె దేవి
కెరలి యద్దనుజుండు శరశతోత్కరముల నప్పరమేశ్వరిఁ గప్పెఁ గదిసి
కోపించి చండిక ఘోరంబు లైనబాణంబుల వానివి ల్నఱకి వైచె


తే.

ధనువుఁ దునిమిన నసుర యుదగ్రశక్తి, పుచ్చుకొనుటయుఁ బటుచక్రమున రయమున
దానిఁ దునుమాడె భైరవి దానవుండు, గనలి యనిమిషేశ్వరిఁ బొరిగొనఁ గడంగి.

210