పుట:మార్కండేయపురాణము (మారన).pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లును విచారితమధ్యభాగులు నై నశించి రంబరంబు బహుతరకబంధబంధురం బయ్యె
బలితంబు లైనకరితురంగభటసముదయాంగంబులను భయంకరంబు లైనరక్తనదీ
ప్రవాహంబులను సమరాంగణంబు ఘోరత్వంబు నొందె నివ్విధంబున నయ్యం
బిక యొకక్షణంబునం దృణదారుసంచయంబులు భస్మంబు గావించువహ్ని
యుంబోలె మహిషాసురచతురంగబలంబులను సంక్షయంబు నొందించె నద్దేవి
సింహంబును బ్రమథగణంబులును సముద్భటరూపంబున నిశాటసైన్యపాటన
పాటవంబున దీపించె నప్పుడు దివిజులు బహువిధంబులం బ్రస్తుతించుచు నప్పర
మేశ్వరిమీఁదఁ బుష్పవృష్టి గురిసి రంత.

95

చక్షురుఁడు మొదలగుమహిషాసురసేనాపతులసంహారము

మ.

దనుజానీకము మ్రగ్గినన్ గని భుజాదర్పంబునం జక్షురుం
డనుసేనాపతి కోపఘూర్ణితముఖుం డై తాఁకి యద్దేవి ను
గ్రనిశాతాశుగవర్షధారల వడి న్గప్పె న్మహాభ్రంబు పే
ర్చి నిలింపాచలతుంగశృంగ మతివృష్టి న్గప్పుచందంబునన్.

96


ఉ.

భైరవి యేచి యద్దనుజుబాణము లన్నియు నుగ్గు సేసి త
త్సారథిఁ గూల్చి యశ్వములఁ జంపి వడి న్విలు ద్రుంచి కేతువు
న్దేరును లీలమై నఱికి తీవ్రశరంబుల వానిమేను దు
ర్వారరయం బెలర్పఁ బలువ్రయ్యలు గా వెస నేసె నేసినన్.

97


తే.

విరథుఁడై చతురుండు దోర్వీర్య మెసఁగ, వాలుఁ బలుకయుఁ గొని శీఘ్రలీల గదిరి
యార్చి సింహంబుశిరముఁ జండాసి సవ్య, బాహువును వ్రయ్య నేసి కోపమున మఱియు.

98


క.

శూలంబు పుచ్చికొని య, క్కాళిధనువు దునిమె వాఁడు గ్రక్కున నది తే
జోలంకృతరవిబింబము, వోలెఁ జదల నుండి యపుడు పుడమిం బడియెన్.

99


వ.

ఇట్లు వడుటయు వేఱొక్కవి ల్లెత్తి.

100


క.

కొని దేవి శరావలి న, ద్దనుజునిశూలంబు నఱికి తను వెల్లను దు
త్తునియలు గా రయమున నే, సిన నాసేనాని విగతజీవుం డయ్యెన్.

101


సీ.

సామజారూఢుఁ డై చామరుం డనుదనుజుండు చండికమీఁదఁ జండశక్తి
నిగిడింప నద్దేవి నిష్ఠురహుంకార మొనరించుటయు నది యుడిగి మడిఁగి
మేదినిఁ బడియె నమ్మేటిరక్కసుఁడు ద్రిశూలంబు వైచె నాభీలలీల
దానిఁ దుత్తునియలు గా నేసె నంబిక, జృంభించి యద్దేవిసింహ మెసఁగి


తే.

కుంభికుంభస్థలం బెక్కి ఘోరబాహు, రణము గావించి వానివారణముఁ ద్రుంచె