పుట:మార్కండేయపురాణము (మారన).pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఋతవద్గర్గులసంవాదము

సీ.

ఇది మునివల్లభ! యెవ్వరిదోషంబుగాదు మీలో విను కారణంబు
రేవతికడపట నావిర్భవించె నీపుత్త్రకుం డాకీడుప్రొద్దుకతన
దౌశ్శీల్య మొందె నాతని నని చెప్పిన ఋతువంతుఁ డతిరోష మెద జనింప
నాయొక్కకొడుకున కీయశుభముఁ జేసి వెలయఁగా రేవతి వెఱపు లేక


తే.

యట్టు లైన నారేవతి యతిరయమున, నిపుడు పడుఁగాత యని శాప మిచ్చుటయును
జోద్యముగ లోక మెల్లను జూచుచుండఁ, బడియె రేవతి కుముదాఖ్యపర్వతమున.

267


క.

రేవతి యిమ్మెయిఁ బడుటయు, నావిపినము వెలుఁగుచుండె నాదీప్తులచే
రేవతి పడుటఁ గుముదగిరి, రైవత మనఁ బరఁగె నిద్ధరావలయమునన్.

268


సీ.

ఆరేవతీదేవిచారుతనుప్రభ రమణీయకమలాకరమునఁ బొంది
కడుఁబొలుపారెడుకన్యక యగుటయుఁ బ్రముచుఁ డన్సంయమి ప్రమద మెసఁగ
రేవతినామంబు నావెలఁదికి నిడి యాత్మాశ్రమోద్భుత యగుటఁ జేసి
తనయగాఁ గైకొని పెనిచి మనోహరయౌవనోద్భాసిని యైనఁ జూచి


తే.

నాతి కెవ్వఁ డొకో తగునాథుఁ డనుచుఁ, దత్సదృశుఁ డైనవరు నెందుఁ దడవికాన
కగ్నిశాలకు నరిగి యయ్యగ్ని నడిగె, దీని కెవ్వఁడు విభుఁ డగుఁ దెలియఁజెపుమ.

269


వ.

అని యడిగిన నయ్యగ్నిదేవుండు.

270


క.

దుర్దమశత్రక్షత్రియ, మర్దనకేళీకథాసమగ్రబలోద్య
ద్దోర్దర్పగరిష్ఠుం డగు, దుర్దముఁ డనునృపతి భర్త తోయజముఖకిన్.

271


వ.

అని యమ్మునీంద్రునికిం జెప్పిన యనంతరంబ.

272


మ.

దమితారాతి ప్రియవ్రతోజ్జ్వలకులోత్తంసైకతేజుండు వి
క్రమశీలక్షితిపాలశేఖరునకు న్గాళిందికి న్బుత్త్రుఁ డు
త్తమచారిత్రుఁడు దుర్దముండు మృగయార్థం బేఁగి యత్యుగ్రదు
ర్గమునం గ్రుమ్మరుచుం దదాశ్రమముఁ జేరం బోయి సంప్రీతితోన్.

273


వ.

దానిం బ్రవేశించి యం దమ్మునీంద్రునిం గానక.

274


క.

రేవతిఁ గని యానృపతి ప్రియా! వచ్చితి మ్రొక్కి పోవ నమ్మునిపతికి
న్నీవు నిజంబుగఁ జెప్పుమ, యావిమలాత్ముఁ డెటఁ బోయెనని యడుగుటయున్.

275


తే.

అగ్నిశాలలోపల నున్నయమ్మునీంద్రుఁ, డతఁడు రేవతిఁ బిలిచిన నాప్రియోక్తి
విని ముదంబున వెలువడి యనుపమాన, రాజ్యచిహ్నాభిరాము దుర్దమునిఁ గనియె.

276

ప్రముచదుర్దమసంవాదము

చ.

కనిన నరేంద్రుఁ డమ్మునికి గౌరవ మొప్పఁగ మ్రొక్కి గౌతముం
డను ప్రియశిష్యు నర్ఘ్యము రయంబున నమ్ముని తేరఁ బంచి నీ
వనఘ! సమంచితార్ఘ్యమున కర్హుఁడ వెన్నఁడు రానివింద వ
ల్లునికి విశేషపూజఁ దగు లోకముచొప్పున మాకుఁ జేయఁగన్.

277