Jump to content

పుట:మార్కండేయపురాణము (మారన).pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

మృగిఁ గా నే నని నన్నుం, దెగిడితి గావేని యింకఁ దెల్లముగా నీ
వగము మృగి వని నిజాకృతి, దగఁ దాల్చి శపించె నన్ను ధరణీనాథా!

243


సీ.

అట్లు శపించిన నమ్మునీశ్వరునకుఁ బ్రణమిల్లి సైరింపు బాలఁ గానె
జనకుఁడు వెలిగాఁగఁ దనయంతఁ గన్నెకుఁ బతి వరియించుట పాడియగునె?
యెఱుఁగవే స్త్రీధర్మ మిట్లేల కోపింప నని పెక్కుమార్లు ప్రార్థనముఁ జేయ
ననుఁ జూచి యోచెల్వ! నాపలు కెట్టిదో యట్టిది నీవు జన్మాంతరమున


తే.

నగుదు మృగివి జాతిస్మర వై త్వదీయ, గర్భమున లోలుఁడనువాఁడు ఘనుఁడు సిద్ధ
వర్యసంయమిపుత్రుండు వచ్చి పొందు, నపుడు నీకు మనుష్యవాక్యములు గల్గు.

244


క.

అమ్ముని పుట్టుటయు మృగీ, త్వము విడిచి నీవు సనుము వనితా! శుభలో
కముల కాలోలుండును, బమ్మినతేజంబు దెసలఁ బరగఁగ నంతన్.

245


క.

అనుపమభుజబలవిక్రమ, ఘనుఁ డగుమను వై ధరిత్రిఁ గడుఁ బేర్చి రణం
బునఁ బితృశత్త్రులఁ బొరిగొని, జనులం బాలించు ధర్మసంపద వెలయన్.

246


వ.

అని యమ్మునీంద్రుం డనుగ్రహించి చనియె నది కారణంబుగా నేను దిర్యక్త్వం
బునం బొంది భవత్కరస్పర్శనంబున నిపుడ గర్భంబు ధరియించితి ని ట్లగుటం జేసి
నీతో నిప్పుడు.

247


క.

ఏ నీ కగమ్య నేయ, స్థానంబున మనసు పుట్టఁ దగునే యంటి
న్దాను రతివిఘ్న ముదరము, లో నుండుట మనకు నిట్లు లోలుఁడు సేసెన్.

248

తామసమనుమహిమాభివర్ణనము

వ.

అని యిట్లు మృగాంగన చెప్పిన విని యన్నరేంద్రుండు పరమానందంబునం
బొందె నంత.

249


ఉ.

ఆమృగికి న్సుతుండు సముదంచితతేజుఁడు సర్వలక్షణ
శ్రీమహితుండు పుట్టుటయుఁ బ్రీతి వహించె సురాష్ట్రభూవిభుం
డామృగి దేహము న్విడిచె నప్పుడు శాపవిముక్త యై ముని
స్తోమము వచ్చె నాసుతునిఁ జూడఁ బ్రమోదముఁ బొందె భూతముల్.

250


వ.

అప్పుడు.

251


తే.

ఘనతమంబు జగంబులఁ గప్పియున్న, వేళఁ దామసయోని నావిర్భవించెఁ
గాన నితఁడు తామసుఁ డనఁగాఁ బ్రసిద్ధుఁ, డై మహావృద్ధిఁ బెనుపొందు ననిరి మునులు.

252


చ.

జనకుఁడు పెంపఁగాఁ బెరిఁగి సౌమ్యుఁడు తామసుఁ డిద్ధబుద్ధి యై
జనకునితోడ నీవు మునిసత్తమ! యెవ్వఁడ? వెట్టు లేను నీ
తనయుఁడ నైతి? మజ్జనని దా నది యెవ్వరు? నీకు నేల యీ
వనమున కేఁగుదే? ననుడు వానికి సర్వము తండ్రి చెప్పినన్.

253


చ.

విని చని యఫ్డు భానునిఁ ద్రివేదమయుం దగఁ గొల్చి తత్కృప
న్వినుతమహాస్త్రశస్త్రముల విశ్రుతుఁ డై తనతండ్రిఁ దొల్లి యో