పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహాత్మాగాంధీ సంస్థాన్ ఏర్పడటం-ఆయన కాంస్య విగ్రహం నెలకొల్పడం భారతీయులు గర్వించ తగిన విషయం.

సాంస్కృతిక ప్రదర్శనలు

మహాత్మాగాంధీ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించడానికి మారిషస్ గవర్నర్ జనరల్ శ్రీ వీరాస్వామి రింగడు, ప్రధానమంత్రి అనిరుద్దీ జగన్నాథ్ మంత్రులు, స్పీకరు, పార్లమెంటు సభ్యులు, ఉన్నతాధికారులు విచ్చేశారు.

మారిషస్ విధ్యామంత్రి శ్రీ ఆర్ముగం పరుశురామన్ స్వాగతం చెబుతూ భారత ప్రతినిధి వర్గానికి అభినందనలు చెప్పారు. ప్రత్యేకించి ప్రపంచ తెలుగు మహాసభల వ్యవస్ధాపకుడు శ్రీ మండలి వెంకట కృష్ణారావుగారు రావటం ఎంతో ఆనందదాయకంగా ఉందని అన్నారు. తరువాత తెలుగులో మాట్లాడుతూ 'తెలుగు భాష మధురం. మనోహరం' అని తెలుగు హృదయాలను పులకింప చేశారు.

ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక బృందం నాయకుడు డా॥ సి.నారాయణరెడ్డి తాము సమర్పించబోయే సాంస్కృతిక కార్యక్రమాల గురించి తెలియ చేశారు.

శ్రీమతి శోభారాజ్ అన్నమయ్య కీర్తనల ఆలాపనతో" కార్యక్రమం ప్రారంభం అయ్యింది. పదకవితా పితామహుడు అన్నమయ్య కీర్తనలు శ్రీమతి శోభారాజ్ మధుర స్వరం ద్వారా జాలువారగా సభికులు ఆధ్యాత్మికానుభూతిలో పరవశులైనారు. "అదివో అల్లదివో శ్రీహరి వాసము' అనే కీర్తన ఆమె ఆలపిస్తూంటే పదివేల పడగల నడుమ శ్రీహరి దివ్య మంగళ విగ్రహం సాక్షత్కరించిన భావన కలిగింది.

'బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే' అంటూ ఆలపిస్తూంటే శ్రోతలు ఆనందాబ్దిలో మునిగి తాళం వేయటం జరిగింది. భాష తెలియక పోయినా-సంగీత జ్ఞానం లేకపోయినా సుమధుర స్వరంతో ఆమె పాడిన తీరుకు మారిషస్ పెద్దలు చప్పట్లు చరుస్తూ అభినందనలు తెలిపారు. అందుకే అన్నారు కాబోలు పెద్దలు సంగీతం పారలౌకికం అని.

శ్రీమతి రాధారెడ్డి, శ్రీ రాజారెడ్డిల కూచిపూడి నృత్యం మెరుపు వేగంతో సాగి ప్రేక్షకుల హృదయాలను ఆనంద తాండవం చేయించింది.

అభినయానికి హృదయమర్పించుకుని కూచి
పూడియే నాడిగా ఆడింది తెలుగు

అన్న సినారె గీతిని ఆ నృత్యం గుర్తుకు తెచ్చింది. మా దివిసీమలోని కూచిపూడిలో