పుట:భాస్కరరామాయణము.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యినుపయుంగరములుఁ గేల నిడినకోల, నేల నందంద మొరయంగ నెరయ నచట
నచట శంబళి శంబళి యనుజనములఁ, గదియ కావలఁ దొలఁగుచు నొదుఁగుచుండె.

592


క.

ఆరాజుఁ జూచి యప్పుడు, పౌరులు భృత్యులు నమాత్యబంధుజనంబుల్
చేరక విడిచి రతండును, గౌరవ మెల్లఁ జెడి పోయెఁ గౌశికుకడకున్.

593


క.

కౌశికుఁ డెఱిఁగి యయోధ్యా, ధీశుఁడ వగునీకు నేల యీచండాల
క్లేశము వచ్చెను నావుడు, నాశాపక్రమముఁ జెప్పి యతిదుఃఖమునన్.

594


వ.

కౌశికునకుఁ బ్రణమిల్లి యతం డి ట్లనియె.

595


సీ.

ఏను జేసెద నన్న యిష్టయజ్ఞము సేయ, నొనర నెన్నఁడు బొంక నొకట మున్ను
నిట్టియాపద నున్న నిటమీఁద నైనను, సత్యంబ పాటింతుఁ జలము మెఱయ
బహుతరాధ్వరములు బహుదానధర్మముల్, ప్రియముతోఁ గావించి పెంపు గంటి
గురుల నారాధింతు గురులు నాపైఁ గృపా, రతిలేమి ధర్మకార్యంబు చిక్కెఁ
దనకు దైవంబు లేకున్నఁ దాను జేయు, పౌరుషం బపకారమై పరిభవించుఁ
గాన నాపాలిదైవమై కావు నన్ను, జనశరణ్య విశ్వామిత్రమునివరేణ్య.

596


మ.

అనుడు నెమ్మది నుండు భూవర ముదం బారంగ నిచ్చోటికి
న్ఘనపుణ్యవ్రతు లైనసర్వమునుల న్రావించి యజ్ఞంబు గ
న్కనిఁ జేయించి తగంగ నీపలుకు నిక్కం బై ప్రకాశింపఁగా
విను నీదేహముతోన నాకమునకున్ వేవేగ యేఁ బుచ్చెదన్.

597


క.

అని తనశిష్యుల నందఱఁ, గనుఁగొని ఋత్విజుల మునులఁ గడువేగమునం
గొని రండు త్రిశంకుఁడు వ, చ్చినవాఁ డటు గాన మఖముఁ జేయఁగవలయున్.

598


చ.

అన విని వార లేఁగి రయ మారఁగ వచ్చి మునీంద్రచంద్ర నీ
యనుమతి మమ్ముఁ దె మ్మనిన యందఱఁ దోడ్కొని వచ్చినార మిం
పెనయ వసిష్ఠునాశ్రమమునీంద్రులు దక్కఁగ నవ్వసిష్ఠునం
దను లొకకొన్ని యాడిరి మదంబులతో విను వారివాక్యముల్.

599


ఉ.

మాలఁడు సోమయాజియటె మాలకు రాజటె యాజకుండు చం
డాలమఖంబునం గుడువ నల్వునఁ బాఱులు వత్తురట్టె ది
క్పాలకు లేఁగుదెంతురటె పైఁబడి తత్య్రతుభాగముల్ గొనన్
వాలి యనామకుండటె దివంబునకుం జనువాఁడు బొందితోన్.

600


క.

విన నివి యెంతయుఁ జిత్రము, లనుచు వసిష్ఠసుతు లాడి రచ్చోటితపో
ధను లంద ఱిచ్చటికి రా, మని యుత్తర మిచ్చి రనిన నతికోపమునన్.

601


మ.

నుతనిష్ఠం దప మగ్రతం జలుపునన్నుం గ్రొవ్వి దూషించును
ద్యతపాపాత్ములు నూఱుభేదములఁ గ్రవ్యాదత్వముం బొంది దు
స్స్థితిఁ గౌలేయకమాంసమున్ దినుచు వర్తింపంగ ని మ్ముర్వి నా
గతి న న్నాడిన యామహాధముఁడు వే కానీ నిషాదుం డిలన్.

602