పుట:భాస్కరరామాయణము.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బ్రథితభూమావృతపావకశిఖభంగి, నురుపాంసుకలిత యై యున్నదాని
శ్యామమేఘచ్ఛన్నచారుతటిల్లత, కైవడి జడ చేతఁ గ్రాలుదాని
బ్రహ్మనిర్మితశుభమూర్తిఁ బరఁగుదాని, విపులశాపభరంబున వేఁగుదాని
నఖిలలోకభూతాదృశ్యమైనదాని, నంతికాత్తమాంగల్య నహల్యఁ గనియె.

515


క.

కన రామునిదర్శనమున, మునిశాపవిముక్త యగుచు ముజ్జగముల కె
ల్ల నహల్య గానఁబడియెను, ఘనవిగమస్ఫురితచంద్రకళచందమునన్.

516


వ.

అప్పుడు రామలక్ష్మణు లతిపుణ్యకల్య యగునహల్యపాదంబుల కెఱఁగిన నాదరం
బున నాయహల్యయు గౌతమువాక్యంబు దలంచి రామలక్ష్మణుల కర్ఘ్యపాద్యంబు
లిచ్చి యతిథిసత్కారంబు లాచరించె నాసమయంబున సురదుందుభులు మ్రోసె
సురలు పుష్పవృష్టి గురియ దేవగంధర్వాప్సరస్సంఘంబు లేతెంచి సాధువాక్యం
బుల నహల్యం బూజించిరి తపోబలశుద్ధాత్మ యైనతనపత్ని సహల్యం జేకొని
యత్యానందంబున రామచంద్రునిఁ బూజించి యారామునిచేత నర్హపూజ
లొంది పత్నీసహితుం డై గౌతముండు దపోవనంబున కరిగె విశ్వామిత్రుండును
రామలక్ష్మణసమేతుం డై మిథిలాపురంబు చేరి యాపురంబున కీశానభాగంబున.

517

విశ్వామిత్రుండు రామలక్ష్మణసహితుండై మిథిలాపురంబున కరుగుట

సీ.

మాళవనేపాళమగధాంధ్రపాంచాల, భోజకాంభోజాదిభూమిపతులఁ
గరిరథాశ్వశ్రేణి ఘనసమిత్కు శముల, జీమూతసమహోమధూమతతుల
దర్భాసనంబులఁ దగినపీఠంబులఁ, బంక్తు లై కూర్చున్న పరమమునుల
సరసస్వరోదారసామఘోషంబుల, సురుచిరయాగోపకరణతతుల
భూరిదధిఘృతక్షీరసంపూర్ణకుంభ, కనకమయవేదికాసముత్కరముల మఱి
పశుసమంచితయూపాళిఁ బరఁగుజనకు, యజ్ఞవాటము సొత్తేర నప్పు డెఱిఁగి.

518


క.

మానొంద శతానందుఁడుఁ, దానును నర్ఘ్యంబు గొనుచుఁ ద్వరతో జనక
క్ష్మానాథుఁడు గౌశికమునిఁ, గానఁగ నేతెంచి వినయగరిమము లమరన్.

519


క.

అర్ఘ్య మొనరించి మ్రొక్కిన, దీర్ఘాయువు నొందు మనుచు దీవించి లస
న్నిర్ఘోషకలితశుభతర, దీర్ఘము మాధుర్య మెసఁగ ధృతి ని ట్లనియెన్.

520


క.

నిరుపద్రవ మై నీయ, ధ్వర మేపారెడినె నీకుఁ దగ భద్రమె నీ
పరిచరుల కెల్ల సేమమె, పరఁగఁగ నన జనకుఁ డపుడు భద్రమ యనుచున్.

521


చ.

మునివర నీవు సంయములు మోదముతోడ మదీయయజ్ఞముం
[1]గనుఁగొన నిందు వచ్చితిరి గావున ధన్యుఁడ నైతి యజ్ఞసం
జనితఫలంబు గంటి నిట సమ్మతి నుండుఁడు ద్వాదశాహముల్

  1. "కనుఁగొన నిందు వచ్చితిరి గావున ధన్యుఁడ నైతి నో మహా
        ఘన విను వీర లెవ్వరు తగ న్వినిపింపుము తచ్చరిత్రముల్
        వినియెద నన్న నమ్మునియు వేగమ చెప్పఁగఁ బూన నయ్యెడన్.
    వ. మఱియును జనకుండు” అని పా.