పుట:భాస్కరరామాయణము.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విసృష్టసమానీతాశ్వరత్నంబు నడుమ నిడి యుక్తక్రమంబున మున్నూఱుపశు
వుల విశసించి యేయేదేవతల కేయేమంత్రంబులు నేయేపశువులపలలంబు లర్హం
బు లాయాదేవతల కాయామంత్రంబులు నాయాపశువులపలలంబు లాహుతులు
సేసి మఱియుం గౌసల్యాదేవి చేతిఖడ్గత్రయంబునం బక్షిసహితంబుగా నశ్వంబు
విశసించి యధ్వర్యద్గాతృహోతలు హయంబు యజనంబుకడకుం జేర్ప యా
జకు లాయశ్వంబువప వెఱికి వేదోక్తక్రమంబున నాహుతులు సేయ నావసాధూ
మగంధంబు లాఘ్రాణంబు సేసి యఖిలభూపాలురుం బాపంబులం బాయ నున్న
యయ్యశ్వంబు సర్వాంగంబులు విహితమంత్రపూతంబులుగా నగ్ని కాహు
తులు సేయుచుం బ్రథమచతుష్టోమద్వితీయోక్తతృతీయాతిరాత్రజ్యోతిష్టోమా
యురభిజిద్విశ్వజిదప్తోర్యామాదిక్రతుసమేతంబుగా నస్ఖలితమంత్రతంత్రంబుల న
య్యశ్వమేధం బలోపక్రియాకలాపంబుగాఁ బరిసమాప్తిఁ బొందింప దశరథుండు
మనోరథలభ్యమానమానసుం డగుచు నధికానందంబుతోడ నధ్వరదక్షిణల
కొఱకు.

114


క.

చన హోతకుఁ బ్రాగ్దేశం, బును బ్రహ్మకు దక్షిణంపుఁబుడమియు నధ్వ
ర్యునకుం బశ్చిమదేశం, బును నుద్గాతకు నుదీచ్యభూమియు నిచ్చెన్.

115


తే.

ఇచ్చి మఱియుఁ దక్కినవారి క ట్లయోధ్య, యొకఁడు దక్కంగఁ దక్కినసకలభూత
లమును నందంద యిచ్చినఁ బ్రమద మంది, వార లాదశరథమహీశ్వరునితోడ.

116


క.

ఏ మెన్నఁ డనుష్ఠానము, నేమంబులు దీర్తు మెపుడు నియమితవేదో
ద్దామాధ్యయనము సేయుదు, మే మెక్కడ భూమి యేలు టెక్కడ మాకున్.

117


క.

భూమికిఁ దగుమూల్యముగా, హేమము లొండె మణు లొండె నీప్సితధేను
స్తోమము లొండెను ని మ్మీ, భూమండల మీవ యేలు పోఁడిగ ననినన్.

118


వ.

అగుఁ గాక యనుచు ముదితాత్ముం డయి దశరథుండు పదిగోట్లు సువర్ణంబులును
నలువదిగోట్లు రజతంబులును వసిష్ఠఋశ్యశృంగాదిఋత్విజులకు నొసంగి మఱి
యుం దక్కినభూసురోత్తములకుఁ గోటిసువర్ణంబులు ననేకదివ్యాంబరాభరణం
బులు నిచ్చి యమ్మునులకు దండప్రణామంబు సేసి సకలభూసురోత్తములు నాశీ
ర్వాదంబులు సేయ సంతోషభరితమానసుం డయి.

119


క.

జనవిభుఁడు ఋశ్యశృంగునిఁ, గనుఁగొని యనఘాత్మ పుత్రకామేష్టి ప్రియం
బునఁ జేయుఁడు మీ రనవుడు, మునివరుఁ డౌఁగాక యనుచు ముదితాత్ముండై.

120


వ.

నానామంత్రపూతంబులుగా నాహుతుల నగ్ని నిడుచుం బుత్రకామేష్టి సేయం
దొడంగిన.

121

బ్రహ్మేంద్రాదిదేవతలు నారాయణుని భూమి నవతరింపం బ్రార్థించుట

క.

అంత హవిర్భాగంబుల, నెంతయు సంతసము నొంద నేతెంచి సభా
భ్యంతరముననుండి సురల్, చింతించిరి రావణుండు సేసిన బాధల్.

122