పుట:భాస్కరరామాయణము.pdf/422

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వే నినుఁ గొని పోవు నయో, ధ్యానగరంబునకు బాహుదర్ప మెలర్పన్.

405


క.

అనవుడు నవ్యాక్యంబులు, విని జానకి రామచంద్రువిజయంబు మనం
బునఁ గోరుచు మీఁ దెట్లొకొ, యనుచుం దలపోయుచుండ నక్కడ నంతన్.

406


ఉ.

వానరసింహనాదము లవారితవార్ధిమహోర్మిఘట్టన
ధ్వానము మ్రింగుచున్ దెసలు వ్రయ్యఁ ద్రికూటనగంబుతోన లం
కానగరంబు గ్రక్కదలఁగా నురుగోపురరత్నపాత ము
ల్కానివహంబుపా టనఁ దలంబుగఁ గ్రందుకొనం జెలంగినన్.

407


వ.

అమ్మహాకలకలంబు విని నిఖిలనిశాచరులు నిక్కడక్కడఁ గడవ నప్పుడు సంభ్ర
మాకులలోచనుం డై దశముఖుం డమాత్యుల నవలోకింప నందు వృద్ధమంత్రి
యు మాతామహుండును నైనమాల్యవంతుం డి ట్లనియె.

408

మాల్యవంతుఁడు రావణునకు నీతిమార్గము చెప్పుట

తే.

అఖిలవిద్యల శిక్షితుఁ డై సమస్త, నీతికళలందుఁ దుదముట్ట నేర్పు గలిగి
వలను దప్పక వర్తించువాఁడు పగఱ, గెలుచుఁ బొలుచు నైశ్వర్యంబు గలిగి వెలుఁగు.

409


క.

సంధియు విగ్రహమును దశ, కంధర తఱి యెఱిఁగి చేఁత కార్యం బగు నా
సంధికి నర్హులు సములును, బంధురబలయుతులు వారు పార్ష్ణిగ్రాహుల్.

410


క.

అధముఁ డనవలదు శత్రుం, డధికుఁడు విగ్రహము గొన్నయప్పుడు మన కే
విధమున సందియ మే ల, ధనుర్ధరుతోడిపగ కడింది దలంపన్.

411


క.

సురమునిగంధర్వాదులు, పరికింపఁగ ధర్మపక్షపాతులు వా రా
నరనాథుజయమ చూతురు, ధరణీసుత నిచ్చి పుచ్చఁ దగు మన కింకన్.

412


వ.

మఱియు నొక్కవిశేషంబు సెప్పెద నాకర్ణింపుము.

413


క.

ధర్మంబు సురలకొఱకు న, ధర్మం బసురులకు నై పితామహుఁ డాదిన్
నిర్మించినాఁడు దత్త, త్కర్మము లిరుగడలవారిఁ దగ రక్షించున్.

414


క.

మనుజులు దివిజులపక్షము, మన మసురలదెసయు నగుట మనకు నధర్మం
బును వారికి ధర్మంబును, ననిశము విజయమును జేయు నమరారాతీ.

415


క.

ధర్మంబుచేతఁ బొలియు న, ధర్మము గృతయుగమునం దధర్మమునం దా
ధర్మము దెగుఁ ద్రేతన్ యుగ, ధర్మ మెఱుఁగవలయు నీతితత్త్వజ్ఞు లిలన్.

416


క.

వ్యసనాసక్తుఁడ వై రా, క్షసవల్లభ నీవు మఱపు గైకొనుట దివౌ
కసులకు విచ్చలవిడి నిం, పొసఁగుచు జన్నములు సేయుచున్నారు మునుల్.

417


క.

హోమానలమునఁ బొడమిన, ధూమంబులు దెసలు గప్పి దోషాచర తే
జోమాలిన్య మొనర్చెడి, జీమూతావళులచెలువు సేసెడిఁ గంటే.

418


ఆ.

అధ్వరంబు లిప్పు డఖిలమునీంద్రులుఁ, దఱుచుగా నొనర్పక ధర్మ మెచ్చె
సందియంబు వలదు జయ మవశ్యము గల్గు, ధర్మవర్తి యైనదాశరథికి.

419