పుట:భాస్కరరామాయణము.pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అంతఁ గపులు.

278


క.

వనముల వనములభంగిన, కొనివత్తుము కొండ లెల్లఁ గుంభిని వ్రయ్యన్
మునుముకొని పెఱికి తెత్తుము, వనరాశికి మిగిలెనేని వైతుము లంకన్.

279


ఉ.

ప్రాకుదుమా త్రికూటశిఖరంబులమీఁదికి నెల్లవారు నొ
క్కూఁకున నంచు నున్నదశయోజనమాత్రము గట్లు గుండులున్
మ్రాఁకులుఁ దెచ్చి తెచ్చి యెడమం గుడి నిచ్చుచుఁ జుట్టుఁ బైపయిం
బ్రోకలు వెట్టుచుండ నటు పూర్ణము సేసె నలుండు సేతువున్.

280


వ.

ఇట్లు దశయోజనవిస్తారంబును శతయోజనాయతంబును గా సేతువు గట్టి సిద్ధవి
ద్యాధరగంధర్వాదు లంబరంబునం గ్రందుకొనునెలుంగులు సెలంగఁ బ్లవంగపుం
గవుల నగ్గించుచు రఘుపుంగవుసామర్థ్యంబున కచ్చెరు వందుచు నీసేతువుం జూ
చినజను లపేతకల్మషులు నాయుష్మంతులుఁ బుత్రవంతులు నగుచు నుత్తమకీ
ర్తుల నుల్లసిల్లుచుండుదు రని పలికి రంత నలుండు జలధిబంధనంబుతెఱంగు
విన్నవించుటయు రామచంద్రుండు ముదితహృదయుం డగుచు సేనానాయకుం డ
గునీలునిం గనుంగొని సేనలఁ బయోధి దాఁటింపు మని నియోగించి సుగ్రీవుం
డును నంగదస్కంధాధిరూఢుండగులక్ష్మణుండును గొలిచి చనుదేరఁ బవనతనయు
నెక్కి చనుసమయంబున.

281


క.

వేయోఘంబులు నానర, నాయకులం గొని గదాకనద్భాహాసా
హాయక మమర విభీషణుఁ, డాయితమై మున్న దాఁటి యద్దరి నుండెన్.

282


చ.

పెఱుకుదు మింక లంక నని పేర్చి కపీంద్రులు దిక్కు లార్పులం
బఱియలు సేయుచున్ బ్రమరి పాఱుచుఁ గేరుచుఁ గ్రేళ్లు దాఁటుచున్
మెఱములు వైచుచున్ నెగసి మేఘము లంటుచు నబ్ధిలోనఁ బె
ల్లుఱుకుచు నీఁదుచున్ మునిఁగి యొండెడఁ దోఁచుచుఁ గట్ట చేరుచున్.

283


ఆ.

ఎన్నఁ బెక్కు లగుచు నెక్కడఁ జూచిన, నడచువారు నడవఁ గడఁగువారు
విడియువారు మఱియు వీడెత్తువారు నై, నేల యీనినట్లు నిండఁబడిరి.

284


వ.

ఇత్తెఱంగున దాఁటి దక్షిణతీరంబునం గలయ విడియ నాపగావల్లభుండు నిజ
నికేతనంబునకుం జని వలయునుపాయనంబులు గొనుచు నేతెంచి రఘువరుం
గనుంగొని.

285


క.

ఆజులకు నరుగునప్పుడు, రాజులు తొడి పూసి కట్టి రమణీయశ్రీ
రాజిల్ల వలయుఁ గావున, రాజోత్తమ తాల్ప నవసరము భూషాదుల్.

286


తే.

అనుచు దివ్యంబులై చెలువారునంబ, రములు భూషణములుఁ గవచములు నాయు
ధములు నెలమిమై నిచ్చిన దాశరథులు, వరుసఁ గైకొని ధరియింప వార్ధి మఱియు.

287


క.

వరుణుఁడు పూజార్థము దన, పురికిని మిముఁ బిల్వ నన్నుఁ బుత్తెంచె నరే
శ్వర విచ్చేయం దగు వ, త్తురు గా కని పలుక నతికుతూహలలీలన్.

288