పుట:భాస్కరరామాయణము.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అని పలికి బాష్పధారలు, కనుఁగవలం గ్రమ్ముదేర ఘనతరదుఃఖం
బున నున్న నన్నుఁ గనుఁగొని, తనమతిఁ దలపోసి మౌని తగ ని ట్లనియెన్.

743


సీ.

దశరథుం డనుపేరిధరణీశునకు రాముఁ డనురాజు పుట్టెడు నామహీశుఁ
డనుజసమేతుఁడై యాత్మపత్నియుఁ దాను, జనకాజ్ఞఁ గానల సంచరింప
రావణుఁ డారాముదేవి మ్రుచ్చిలి కొని, పోవ నాచొప్పున దేవి వెదక
నారాముపంపున నధికవానరవీరు, లేతేరఁగలరు వా రిటకు వచ్చి
యెపుడు నీతోడ భాషింతు రపుడ నీకుఁ, బక్షములు వచ్చి ప్రాయంబు బలము జవముఁ
గన్నులును గల్గి క్రాలెదు మున్నపోలె, నని మునీంద్రుఁడు చెప్పి నెయ్యమున మఱియు.

744


వ.

ఖగవర మరణేచ్ఛ మారామదూతలు వచ్చునందాఁక నిచట నుండుము నీకు
ను రామలక్ష్మణులకును సురమునిబ్రాహ్మణులకు నింద్రునకు హితం బైనజానకి
వృత్తాంతం బెఱింగింపుము రామలక్ష్మణులం జూడ నాకును బ్రియంబు గలదు నీ
విచట నుండు నీకు సర్వంబును మే లయ్యెడు ననుచుం బలికి యమ్మునివరుండు
గ్రమ్మఱ నయ్యాశ్రమంబుఁ జొచ్చె నేను నంత.

745


క.

మునివరునానతి చిత్తం, బున నిడికొని యిచట జీవమును విడువక య
ల్లనఁ బాదమ్మున వెడలం, జని క్రమ్మఱ బిలముఁ జొచ్చి సముదితచింతన్.

746


వ.

రే లెల్ల నిదుర గానక కాలంబున కెదురుచూచుచుండ నూఱేండ్లు చనియె నం
త నిశాకరుం డనుమునివరుండు క్రమ్మఱ నాకమ్మున కరిగె నే నతిదుఃఖంబుఁ బొం
ది జీవంబు చిక్కంబట్టుకొని యుండ నేఁటికి వానరముఖ్య లైనమీర లేతెంచి
తిరి మీతోడ సీతావృత్తాంతంబు చెప్పితి నివె నాకుఁ బక్షంబులు వచ్చె మున్న
పోలెఁ బరాక్రమయౌవనంబులఁ బొందితి నని పలుక వానరులు వానిం జూచి
సంతోషించి సీతాన్వేషణగమనోత్సుకు లై యుండ నవ్వానరులం జూచి క్రమ్మ
ఱ సంపాతి యి ట్లనియె.

747

సంపాతి వానరులకు సీత యుండుచో టెఱింగించుట

సీ.

రూపింప నిచటికిఁ క్రోశమాత్రంబున, దక్షిణాంబుధి చెంతఁ దనరి యొక్క
యచల మున్నది వీఁక నయ్యద్రి పై నుండి, శతయోజనం బగుజలధి దాఁటి
యట లంకఁ గాంచెద రాలంకలోఁ బుణ్య, శీల యున్నది మీరు సీతఁ జూచి
కృతకార్యసిద్ధులై యతిమోదమున మీఱి, వెస వచ్చెదరు రామవిభునికడకుఁ
దప్ప దమ్మునీంద్రునిప్రసాదమున నాత్మ, వెలయఁ జూచిన నంతయుఁ దెలియఁ గాన
వచ్చెఁ గాన చెప్పితి మీకు వలయువాంఛి, తార్థలాభంబు లొందనిం డనుచుఁ బలికి.

748