పుట:భాస్కరరామాయణము.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

శతమఖవైరి రావణుఁడు చండమదంబున మీరు లేనిచో
క్షితిసుత లీల నెత్తుకొని చెచ్చెర లంకకు నేఁగె నింక మీ
రతిబలుఁ డైనశూరుని సహాయునిఁగాఁ గొని కాని వాని ను
ద్ధతిఁ బరిమార్పలేరు వసుధావర మీకు హితంబుఁ జెప్పెదన్.

405


క.

లలి వాలి వెడల నడిచిన, నలువురుమంత్రులును దాను నలినాప్తసుతుం
డలవడ నున్నాఁడు విని, శ్చలమతితో ఋశ్యమూకశైలాగ్రమునన్.

406


ఉ.

ఆకపినాథుతోడఁ బ్రియ మారఁగ సఖ్యము సేయు మాతఁ డ
స్తోకబలుండు విక్రమయుతుండు కృతజ్ఞుఁడుఁ గామరూపియున్
నీకు సహాయుఁ డై హితము నేర్పునఁ జేయఁగలండు వానరా
నీకము లోలిఁ బెక్కులు గణింపఁగ నాతని కొప్పు భూవరా.

407


వ.

ఆసుగ్రీవుండు దేశకాలజ్ఞుండు వాలివలనిభీతిం బోయి సకలదేశంబులుం జూచి
నాఁడు గాన మహావీరు లైనవానరుల నెల్లదిక్కులకుం బనిచి యెక్కడ
నున్నను రావణుని సాధించి సీతను దెచ్చి నీకు సమర్పింపఁగలం డని పలికి
వెండియు.

408


శా.

సుగ్రీవుండు ప్లవంగసైన్యములతో సొంపార నేతేరఁగా
నుగ్రోదగ్రత లంకపై నడచి వీరోత్సాహ మేపారఁ బం
క్తిగ్రీవుం బరిమార్చి రామనృప ధాత్రీపుత్రిఁ దోకొంచు నీ
వగ్రీయప్రియ మార నేఁగెద వయోధ్యారాజ్యముం జేయఁగన్.

409


వ.

రామచంద్రా యీత్రోవం బశ్చిమదేశంబున బిల్వతాళప్రియాళురసాలప్లక్ష
న్యగ్రోధకింశుకాశ్వత్థకర్ణికారమధూకమంజులరోహితకకుభాదితరువులు విలసిల్లు
నందు వలసినవృక్షంబు లెక్కి ఫలంబులు రాల్చి యమృతకల్పంబు లైనయాఫలం
బులు భక్షించి యరిగి ముందట నున్న విపినంబుల దేశంబులఁ జూచుచుం జారు
కమలోత్పలంబుల మెఱసి విలసిల్లుచు హంసక్రౌంచసారసంబులు పలుకుస్వనం
బుల నొప్పారు పంపాసరోవరంబున కరిగి యట విశ్రమించి సుగ్రీవునితోడ సఖ్యం
బు సేయుండు కార్యసిద్ధి యయ్యెడు నేఁగుం డనుచుం బలికి రామునిచేత నను
జ్ఞాతుం డై తనదివ్యరూపంబుతోడ రెండవసూర్యుండునుంబో వెలుంగుచుం
గబంధుండు నాకలోకంబున కరిగె నప్పుడు రామలక్ష్మణులు వెఱఁగందుచుం గ
బంధుండు చెప్పినజాడం బూర్వదిశాభిముఖులై యరుగుచు నక్షుద్రకల్పఫలవృ
క్షంబులు గలయొక్కశైలంబు గని యాశైలంబువెనుక రాత్రి వసియించి మఱు
నాఁడు దూరమార్గం బేఁగి విచిత్రవనశోభితం బగుపంపాతీరపశ్చిమదేశంబు సేరి
నిల్చి బహుకుసుమఫలభరితతరువిలసితం బగుశబరియాశ్రమంబు గని యయ్యా
శ్రమంబు సొచ్చి యేతేర నారామలక్ష్మణుల కెదురుగాఁ గృతాంజలి యై శబరి
వచ్చి వినయంబు సేయునప్పుడు శబరిం జూచి రాముం డి ట్లనియె.

410