పుట:భాస్కరరామాయణము.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మహాపుణ్యుం డైన రామునిచేత సంస్కృతుం డగుటను రణనిహతుం డగు
టను జటాయు వత్యంతపుణ్యలోకంబున కరిగె రామలక్ష్మణులు శోకవ్యాకుల
చిత్తు లగుచు.

373


చ.

అరుణుఁడు గ్రుంక నప్పుడు నిజాశ్రమవాసములోని కేఁగి య
య్యిరువురు నిద్ర లే కచట నెంతయు వందుచు నుండి యవ్విభా
వరిఁ దరియించి శూన్య మగువాసముఁ బాసి మహీజ యున్నచో
టరయఁగఁ బశ్చిమాభిముఖు లై చని రాతతవేగ మారఁగన్.

374


వ.

చని శరచాపహస్తు లయి ముందట నప్రతిహతమార్గంబున నడచి కిసలయకుసు
మఫలలతాపరివృతంబును సింహవ్యాఘ్రాదిసత్త్వభీమంబును నతిదుర్గమంబును
నైనమహారణ్యంబు గడచి జనస్థానంబునకుఁ ద్రిక్రోశమాత్రంబున నున్న
క్రౌంచవతిఁ బ్రవేశించి వరపక్షిగణాన్వితంబును నానావర్ణపుష్పఫలశోభితంబును
బహుపర్వతదుర్గమంబును నగునొక్కవనంబు గని యవ్వనంబున సీత నన్వేషిం
చుచుఁ దమసానదిం గని.

375


తే.

తత్సమిపావనీస్థలి దాశరథులు, ఘనులు గాంచి రయోముఖి యనునిశాటి
నూర్ధ్వకేశి లంబస్తని నుగ్రగంధిఁ, గుండకుక్షి ఘూకస్వర ఘోర నెదుర.

376


క.

అగ్గలిక నానిశాచరి, దగ్గఱఁ జనుదెంచి రాముతమ్మునికరమున్
దిగ్గనఁ బట్టి మనంబున, బెగ్గడిలక వికటదంష్ట్రభీకర యగుచున్.

377


వ.

సౌమిత్రి కి ట్లనియె.

378