పుట:భాస్కరరామాయణము.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పక్షీంద్రుండు రావణు మార్కొని బహుప్రకారంబుల యుద్ధంబు సేసి బలవిక్ర
మంబులు నెఱపి నాకొఱకు రావణుచేత మృతిఁ బొందె నట్లు గాన జటాయువు
నకు స్వర్గం బవశ్యంబునుం గలుగు నీజటాయువు మన కిట్టి పురుషార్థంబు సేయు
టరయఁ దిర్యగ్జాతులయందు నార్యులు శూరులు శరణ్యులు ధర్మచరితులుఁ గల
రని పలికి.

368

శ్రీరాముఁడు మృతుండైనజటాయువున కగ్నిసంస్కారాదు లొనర్చుట

క.

పితృపైతమహ మగుసం, తతరాజ్యము పుత్రమిత్రదారామాత్య
ప్రతతిం బాసి ఖగేంద్రుఁడు, హతుఁ డయ్యెను నాకుఁ బూని యకట మహాజిన్.

369


క.

ఆలితనంబునఁ బెక్కుల్, వేలేఁడులు బ్రతికి యధికవిక్రమయుతుఁ డై
యాలమునఁ బొలిసె నితఁడుం, గాలము నెవ్వండు గడిమిఁ గడవఁగనోపున్.

370


వ.

సౌమిత్రీ మనకు నిప్పక్షీంద్రుం డుపకారంబు సేయవచ్చి మృతిం బొందినఁ జూచి
సీత వోవుటకంటె దుఃఖం బొడవెడు మనకు నిప్పక్షీంద్రుండు దశరథునియట్ల
పూజ్యుండును మాననీయుండునుం గాన యగ్ని మథించి కాష్ఠభారంబులు దెమ్ము
చితిమీఁద జటాయువుం బెట్టి దహించెద నని పలికి.

371


చ.

అనుజ మహీవదాన్యులకు హాటకదానుల కాహనానివ
ర్తనులకు నాహితాగ్నులకు ధర్మసమగ్రుల కాపదర్థస
జ్జనశరణార్థిపాలురకు జానుగఁ గల్గెడుపుణ్యలోకముల్
ఘనుఁ డగునీఖగేంద్రునకుఁ గావుత నాదుపరిగ్రహంబునన్.

372


వ.

అని పలికి చితి పేర్చి యాచితిమీఁద జటాయువుం బెట్టి నాచేత సత్కృతుం
డయిన పక్షీంద్రుం డితండు నాయనుజ్ఞను తమలోకంబులఁ బొందు ననుచుఁ బలికి
జటాయువును దహించి లక్ష్మణసమేతుండై వనంబున నొక్కహరిణిం జంపి తదీయ
మాంసంబునం బచ్చనికడిమిడిపట్టునం జటాయువుం దలంచి దర్భపూతంబుగాఁ
బిండంబు పెట్టి విధ్యుక్తక్రమంబునఁ బ్రతత్వనిర్గమనంబుఁ గలుగం జేసి మఱి
గోదావరి కేఁగి కృతస్నానుం డై యాపుణ్యనదీజలంబుల ధర్మోదకం బిచ్చిన