పుట:భాస్కరరామాయణము.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

వనట నిటులు విలపించుచు, ననుజుఁడు బోధింప మాన కాతురపడుచుం
గనుఁగవ నశ్రులు రాలఁగ, ఘనబాహులు మీఁది కెత్తి గగనోన్ముఖుఁ డై.

303


క.

భావజలీలలఁ బ్రియమునఁ, గావించు సుఖోపభోగకాలంబుతఱిన్
నావల్లభ ననుఁ బాసిన, నే వందెదఁ గాఁకఁ ద్రిభువనేశ శచీశా.

304


వ.

అని యా క్రోశించి సౌమిత్రిం గనుంగొని.

305


క.

మందాకిని కేఁగి మహీ, నందన కమలములు గోసి నలువున లీలం
జెందఁగ నున్నది లక్ష్మణ, పొందుగ నీ వచటి కేఁగు భూమిజఁ జూడన్.

306


క.

అని పలికిన సౌమిత్రియు, ఘనవేగమునఁ జని యచటఁ గలయ మహీనం
దనఁ జీరి వెదకి కానక, జనపతితోఁ జెప్ప లేదు జనకజ యంచున్.

307


తే.

అప్పు డఖిలభూతంబులు నాదశాస్యు, చావుకొఱకు మందాకిని నీవు పోయి
రామవిభుతోడఁ జెప్పుము భూమితనయ, వార్త యనవుడు నానది వచ్చి యెలమి.

308


క.

రామునితో దశకంఠుఁడు, భూమిజ నెత్తుకొని వేగ పోయెను లంకా
ధామంబున కని చెప్పుచు, నామందాకిని నిజాలయంబున కరిగెన్.

309


వ.

అంత రాముండు సౌమిత్రితో నిట్లను మందాకినిని జనస్థానంబునం బ్రస్రవణ
గిరులను వెదకితిమి సీత నెక్కడం బొడగాన మనుచు దుఃఖించు చున్న యన్నను
లక్ష్మణుం డూరార్చి యొక్కెడ సీతం బొడగనియెదము గాక యనుచుం బలుక
నప్పుడు రాముఁడు పుష్పదామంబు గని సౌమిత్రి కి ట్లనియె.

310


తే.

భూమిసుతశిరంబున నున్న పుష్పమాల, నేలఁబడియున్నయది దీనిఁ బోలఁ జూడు
మనుజ విరు లివె నెరసిన వవనిపుత్రి, యుండనోపు నీఘన మగుకొండమీఁద.

311


వ.

అని పలికి రోషావేశంబున నన్నగంబు మిడుఁగుఱులు వాఱం జూచి రాముం
డి ట్లనియె.

312


క.

సీతం జూపక యుండిన, నీతరుసానువులు నాదునిష్ఠురబాణ
వ్రాతాగ్నిఁ గాల్చి భస్మీ, భూతంబులు గాఁగఁ జేసి పుచ్చెదఁ గడిమిన్.

313


క.

ఈతటిని నిగురఁజేసెద, శాతోగ్రాస్త్రముల ననుచు జగతీస్థలి న
త్యాతత రావణుపదములు, సీతపదంబులును గాంచి క్షితిపతి యచటన్.

314


క.

పొడగని సౌమిత్రికి న, య్యడుగులు సూప నవి సూచి యాలక్ష్మణుఁ డె
క్కుడు భీతిఁ బొందె రాముఁడుఁ, దడయక వి ల్లెక్కు పెట్టి తమ్ముని కనియెన్.

315


క.

నాకడ జానకి యుండఁగ, నాకాలుఁడు సపరివారుఁ డయ్యును గాంతన్
వే కదియ లేఁడు రక్కసుఁ, డాకసమున కేఁగినాఁడొ యవనిజతోడన్.

316