పుట:భాస్కరరామాయణము.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యారుచిరాంగి వేగపడి యప్రియవాక్యము లెన్ని యాడినన్
సైరణసేయఁగాఁ దగదె చండమృగోరగరాక్షసోగ్రకాం
తారములోన నయ్యబలఁ దమ్ముఁడ యొక్కత డించి వత్తురే.

246


క.

ఆయింతి నిన్నుఁ బొమ్మన, నాయానతిఁ దప్పి నీమనంబున నతిలో
పాయత్తుఁడ వై నీ విటు, నాయొద్దకు నేల వచ్చినాఁడవు వత్సా.

247


శా.

అన్నా నన్ను బలాఢ్యుఁగా నెఱుఁగు దీ వన్నాతి శోకార్తిమె
నిన్నుం బల్కిన నంతనంత నయినన్ నీ వుండ వై తింతకున్
నన్నున్ నిన్నును నేఁచు దానవులు మానం బూన మై పోవఁగా
నన్నాతిం గొనిపోవకుండుదురె యయ్యబ్జాననం గ్రూరతన్.

248


క.

అని పలికియు మృగరూపం, బున న న్నెలయించుకొనుచుఁ బో దూరము పో
యిన నెఱిఁగి యిద్దురాత్ముఁడు, ఘనవంచనశీలుఁ డంచుఁ గడుఁగోపమునన్.

249


శా.

ఆరాత్రించరు నుగ్రబాణమున నేయం బల్విడిం దాఁకి వి
స్ఫారోరస్స్థలిఁ గాఁడినంత మృగరూపం బేది యస్మద్ధ్వనిన్
ఘోరార్తశ్రుతి దిక్కు లం జెలఁగ నాక్రోశించుచున్ రాక్షసా
కారుం డై ధరఁ గూలి చచ్చె నురురుక్తం బుర్విపైఁ గ్రక్కుచున్.

250


క.

అని పలికి యాత్మలోపల, జనకజఁ దలపోయుచున్ విచారముతోడన్
జనవిభుఁడు జనస్థానము, ననుజుండును దానుఁ జొచ్చి యయ్యెడఁ ద్రోవన్.

251


చ.

ఎడనెడ రామభూవిభుఁ డనేకవిధంబుల దుర్నిమిత్తముల్
పొడగని యాత్మలో భయముఁ బొందుచు లక్ష్మణుఁ జూచి యి ట్లనుం
గడు నశుభప్రకారములు గానఁగ నయ్యెడి నేమి కీడు పొం
దెడునొ కుమార యంచు నతిదీనత నేఁగెను బర్ణశాలకున్.

252