పుట:భాస్కరరామాయణము.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చొప్పున నున్న రావణునిఁ జూచెఁ దృణావృతకూపసన్నిభున్.

87


వ.

చూచి వినయంబుతో నర్ఘ్యపాద్యాదు లిచ్చినం గైకొని యమ్మాయాపరివ్రా
జకుం డి ట్లనియె.

88


శా.

ఇంతీ యెవ్వరిదాన వెం దునికి ము న్నే మండ్రు నీనామ మి
క్కాంతారంబున కేల వచ్చితి జగత్కల్యాణ మీదేహ మ
త్యంతాయాసముఁ బొందఁజేసిననిమిత్తం బేమి నీ వేటికిన్
వంతం బొందినదాన వి ట్లనుడు నవ్వామాక్షి దాని ట్లనున్.

89


క.

చిరపుణ్యుఁడు జనకుం డను, నరపతిసుత సీత యండ్రు నన్ను నయోధ్యా
వరుఁ డగుదశరథధరణీ, శ్వరుకోడల నేను రామచంద్రునిభార్యన్.

90


వ.

అని చెప్పి తమవనవాసవృత్తాంతంబును గనకమృగంబుపిఱుంది రామలక్ష్మణు
లు సన్నతెఱంగు నెఱింగించి.

91


క.

మునినాథ విశ్రమింపుఁడు, జననాథుం డిపుడ వచ్చి సత్కారము మీ
కొనరించు ననిన రావణుఁ డనియెను భూపుత్రిఁ జూచి యధికప్రీతిన్.

92


క.

నీతెఱుఁగుఁ బతితెఱంగును, జేతోముద మొదవ నాకుఁ జెప్పితి వనితా
నాతెఱఁగు నాబలంబును, నీతో నెఱిఁగింతు వినుము నెయ్యం బొదవన్.

93


చ.

కమలభవుండు తాత గుణగణ్యుఁడు విశ్రవసుండు తండ్రి హే
మమయవినూత్నరత్నమయమండిత మాత్మపురంబు లంక వి
క్రమము త్రిలోకభీకర మఖండశుభాకర మైనదైత్యరా
జ్యమునకు నేను భర్తఁ బటుశౌర్యుఁడ రావణనామధేయుఁడన్.

94


సీ.

మృత్యువునైనను మృత్యువుఁ బొందింతు, నగ్నినైనను సమర్షాగ్ని నోర్తు
యమునైన లయకాలయముఁడ నై శాసింతుఁ, దపనునైనను నేఁ బ్రతాపతీవ్ర
తపనుఁడ నై మింతు ధనదుని నైనను, ఘనధనదుండ నై గర్వ మడఁతు
వజ్రి నైనను మహావజ్రినై వధియింతుఁ, బవను నైనను జండపపనుఁ డనఁగ
నెదిరి భంజింతుజగముల నెందుఁ బరఁగు, సుందరులఁ దెచ్చి భోగింతు సుందరాంగి
నీవిలాసంబు విని యాత్మ భావభవుని, చేత నలఁగి వచ్చితి వేయుఁ జెప్ప నేల.

95