పుట:భాస్కరరామాయణము.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఖరుఁ డాదిగఁ గలహితులం, బొరిగొని శూర్పణఖ నట్లు పోఁడిమి చెడ ను
ద్ధదురభంగి భంగపెట్టిన, దురితాత్మునితోడ నెట్లు దొడరక పోదున్.

20


ఉ.

మానము దూల బుద్ది పలుమాఱును జెప్పుట మాను మెట్లు న
మ్మానవుభార్యఁ దెత్తు నవమానము లే దిదె నీవు రాక దు
ర్మానముఁ బొంది యున్న నభిమానముఁ బ్రాణముఁ గొందుఁ జాల స
న్మానము సేసి మెత్తు నవమానము సేయక తోడు వచ్చినన్.

21


క.

అని తెంపు మీఱఁ బల్కిన, దనుజుండు దశాస్యునెదురఁ దాఁ బలుకక చ
య్యనఁ గదలి యతనితోడన, చనియెం బతికినుక కులికి చతురుం డగుచున్.

22


వ.

[1]అమ్మారీచుండు దనమనంబున నిన్నీచుచేతం జచ్చుటకంటె రఘురాముచేతఁ జచ్చి
నం బరమగతి గలదు కావున నిదియ మేలుకార్యం బనిపూని రావణున కనేకమాయో
పాయంబు లుపన్యసించి చూపుచుం జనియె నతండు నీవు నాకుఁ బ్రాణమిత్రుండవు
పూర్వామాత్యుండ విక్కార్యంబు సిద్ధించిన నర్ధరాజ్యం బిత్తు నని యుపచరిం
చుచు (నెడ నెడ గరులు నదులు వనంబులుఁ గనుంగొనుచుఁ బెక్కుదేశంబులు
గడచి దండకారణ్యంబు సొచ్చి నానాతరుశోభితం బగుచున్న పంచవటీతీరంబునం
దేరు డిగ్గి మారీచుం జూచి మనవచ్చిన కార్యం బనుష్ఠింతువు గా కని నియోగిం
చిన వాఁడును.)

23

మారీచుఁడు మాయాకురంగ మై రామాశ్రమమునకు వచ్చుట

సీ.

రుచిరవైదూర్యంబు రూపార నచ్చున, వచ్చినవిధమున వదన మమర
భర్మనిర్మితపద్మపత్రంబు లలవడ, నొత్తిన లయఁ గర్ణయుగము మెఱయ
లలితమాణిక్యశలాకలలాగు మై, కొన నమర్చినభంగిఁ గొమ్ము లొప్ప
నింద్రనీలములబా గేర్పడ ద్రచ్చివై, చినగతి గొరిజలు చెలువు మిగుల
నుదర మిందుబింబద్యుతి నుల్లసిల్లఁ, గనకకేసరాంకురరోమకాంతి నిగుడ
నొకమాయాకురంగ మై యొయ్యనొయ్యఁ, జనియె నిలుచుచు నాపర్ణశాలకడకు.

24


సీ.

నెలలోనియిఱ్ఱికి నీలకంఠునిచేతఁ, బొలుపారులేడికిఁ బుట్టె నొక్కొ
యజుఁ డన్నిరత్నంబులందునుం గలుగుక్రొ, మ్మించుల దీనిఁ గల్పించెనొక్కొ
రోహిణాచలము మేరువుఁ గూడి యురుతర, ప్రభల నీహరిణంబుఁ బడసెనొక్కొ
క్రొక్కారుమెఱుఁగులుఁ జుక్కలయొఱవును, గలసి యీమృగ మయి వెలసెనొక్కొ
దీనిఁ బోలంగ జంతువుల్ త్రిభువనముల, యందు మఱి కలవొకో యని యాత్మ మెచ్చి
ప్రీతి వనదేవతలు సూడ సీతదృష్టి, మార్గమున కల్లఁ జనియె నమ్మాయయిఱ్ఱి.

25
  1. 23 మొదలుగా 25 వఱకుఁ గల పాఠమునకు మాఱుగా
    తే. ఇవ్విధంబున నరిగి రాజేంద్రచంద్రుఁ, డున్నకడలివనంబున కొయ్యఁ జేరి
         యచట రావణు నిలిపి మాయాకురంగ, మయ్యె మారీచుఁ డురుదీప్తు లతిశయిల్ల.