పుట:భాస్కరరామాయణము.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శ్రీరాముని నవలోకింపం బితామహపురస్సరంబుగా సురలు గరుడోరగగంధర్వ
యక్షరాక్షసప్రభృతులును జనుదెంచి చూడఁ బరశురాముండు శ్రీరామునిం
గనుంగొని.

745


క.

నావి ల్లెక్కిడినప్పుడ, నీవు చతుర్భుజుఁడ వౌట నిక్కము మదిలో
భావించి కంటి నితరుల, కీవిక్రమబాహుశక్తు లెందును గలవే.

746


ఉ.

కావున నీవు రాఘవ జగత్త్రయకర్తవు సర్వదేవతా
దేవుఁడ వైనవిష్ణుఁడవు తెల్లము నా కిటు లౌట నింద గా
దీవిజయంబు నావిజయ మేనును నీవును వైష్ణవాంశసం
భావితభద్రమూర్తులము పంకజనాభునిలీల లిన్నియున్.

747


క.

సకలధరిత్రిం గశ్యపు, నకు నే మును దాన మిచ్చినాఁడ నిలన్ ని
ల్వకు మనియె నతఁడు గావునఁ బ్రకటంబుగ నిల్వరాదు రాత్రులుఁ బుడమిన్.

748


వ.

నాకు మహేంద్రాద్రికి ననుదినంబు నరుగవలయుం గావున నాచరణంబు లేయక
నాపుణ్యలోకమార్గంబు లేయు మనుడు నాశ్రీరాముం డట్ల చేయం బ్రియంబునఁ
బరశురాముండు రఘురామునకుం బ్రదక్షిణం బాచరించి మహేంద్రాద్రికి నరిగె
నాసమయంబున సుఖవాయువులు వీచె దిశలు ప్రసన్నంబు లయ్యె సేన కుత్సా
హం బొదవె దేవత లభినుతులు సేసిరి రాముండు దనచేత నున్నజామదగ్న్యు
చాపంబు వరుణున కిచ్చి మహోత్సాహంబునం జనుదెంచి వసిష్ఠదశరథులకు
మ్రొక్కి పరశురాముండు వోయె నని తండ్రిభయంబు వాపి యింక సేనాసమే
తుండ వై విచ్చేయు మనవుడుఁ దెలివొంది దశరథుం డక్కుమారు నక్కునం
జేర్చి మూర్ధఘ్రాణంబు సేసి యత్యంతనంతోషంబున నఖిలజనసమేతుం డయి
యయోధ్యాపురంబుఁ జేర నరిగి.

749

దశరథుం డయోధ్యకు వచ్చుట

చ.

సురుచిరతోరణంబులఁ బ్రసూనవిరాజితమందిరాంగణో
త్కరముల నుద్ధతధ్వజనికాయనికేతనకేతనంబులన్
వరమణిచిత్రచిత్రితనివాసవిభాసితసౌధవీథులం
బరఁగుచు నున్నపట్టణము ప్రాభవ మొప్పఁగఁ జొచ్చి ముందటన్.

750


క.

డంబుగఁ బంచమహాశ, బ్దంబులు మ్రోయంగ నర్థితతు లొగిఁ గైవా
రంబులు సేయ సుధాక, ల్పంబులు గానికలుఁ గొనుచుఁ బ్రభువులు డాయన్.

751


క.

లాజలు లలితాక్షతములు, రాజితనూత్నప్రసూనరత్నములు పురం
ధ్రీజనములు సల్లఁగ నీ, రాజనములు సేయఁ బంక్తిరథుఁ డతిమహిమన్.

752


మ.

నగ రింపారఁగఁ జొచ్చె నప్పు డధికానందంబు లుప్పొంగఁగాఁ
దగఁ గౌసల్యయుఁ గైకయున్ మఱి సుమిత్రాదేవియున్ వచ్చి యి
మ్ముగఁ గోడండ్రుఁ దనూజులున్ వరుసతోన్ మ్రొక్కంగ దీవించుచున్