పుట:భాస్కరరామాయణము.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గరచాపాశుగభీమునిన్ మదయుతక్షత్రాద్రిసుత్రామునిన్
హరణోదారకుఠారవారితవిపక్షారామునిన్ రామునిన్.

722


అటు పొడగాంచి యందఱు భయాపహమంత్రము లుచ్చరించుచుం
బటుగతి నర్ఘ్యపాద్యములు భక్తిమెయిం గొనిపోవ వాని నా
దట వరియింప కమ్మునుల దాఁటి మహోగ్రత రాజరాముముం
డట భృగురాముఁ డెంతయును దర్ప మెలర్పఁగ వచ్చి నిల్చినన్.

723

శ్రీరామునిఁ బరశురాముఁ డడ్డగించుట

క.

ఆరామున కతిభక్తిన్, రారాముఁడు మ్రొక్కి యతనిరాజసతేజో
గౌరవముల కరు దందఁగ, నారాముని కనియె నాద్యుఁ డగు రాముఁ డటన్.

724


క.

ఫాలాక్షునిచాపము బా, హాలఘుసత్త్వమున విఱిచి తని జను లెన్నం
బోల మహేంద్రాద్రిని విని, వాలిననీలావు చూడ వచ్చితి నిటకున్.

725


శా.

స్ఫీతాక్షీణబలంబు పెం పెసఁగ నాచే నున్నయీచాపముం
జాతుర్యంబున నెక్కుపెట్టి విపులజ్యావల్లి కర్ణాంచలా
న్వీతాకృష్టిఁ దనర్పఁ జేసి శరమున్ నేర్పార సంధించినన్
నీతో ద్వంద్వరణంబు సేసెదఁ గడు న్వీరక్రియానైపుణిన్.

726


వ.

అనవుడు దశరథుం డతిభీతచేతస్కుండును విషణ్ణవదనుండు నగుచుఁ గరంబులు
మోడ్చి వినయంబున జామదగ్న్యునితో నిట్లనియె.

727


సీ.

మఖవేళఁ గశ్యపముఖమహీసురులకు, ధర యెల్ల నిచ్చిన ధర్మనిధివి
స్వాధ్యాయపరుఁడవు జమదగ్నిసుతుఁడవు, బ్రహ్మవర్చసమూర్తిభాసురుఁడవు
నత్యంతనియతితో నడవిఁ దాపసవృత్తి, విజితేంద్రియుండవై వెలయుసుకృతిల
వింద్రుని ప్రార్థన నెసఁగి క్షత్రియహింస, సనఁ జేయకుండిన శాంతమతివి
బాలుఁ డీరాముమీఁదఁ గోపంబు దగునె, యీకుమారుండు ప్రాణ మిక్ష్వాకుకులుల
కెల్లఁ గావున రక్షింపు మీతనూజు, భద్రకారుణ్యగుణధామ పరశురామ.

728


వ.

అనుదశరథుపలుకు లాదరింపక పరశురాముండు రామునిం జూచి.

729


ఉ.

రా జఁట యంతమీఁద మఱి రాముఁడు దా నఁట భీకరాజులన్
రాజులఁ ద్రుంచి తత్ప్రసృతరక్తములం బితృతర్పణక్రియల్
రాజిలఁ జేసి యున్నభృగుకరాముఁడు తుచ్ఛమదాంధు లైనయీ
రాజులు గీజులన్ వెడఁగురాముల గీములఁ జూచి సైచునే.

730


చ.

అదియును గాక నాకు గురుఁ డైనమహేశ్వరుదివ్యచాపము
న్మదమునఁ బట్టి వే విఱిచినాఁడ వొకింత సహింపు మీవు నా
యెదురను నిల్చి భక్తు లిటు లెన్ని యొనర్చిన నేను నింతతోఁ
దుది సన నిన్ను నుక్కడఁగఁ ద్రుంపక చంపక పోవ నీ ననన్.

731


వ.

రామచంద్రుం డి ట్లనియె.

732