పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

29


నవాబు. తరువాత వారి విరోధులగు ఫ్రెంచివారితో యుద్ధములందు సహాయము జేసినవాడు నితడే.

ఇట్టి ఆప్తమిత్రుడు ఆ శతాబ్దము పూర్తియగునప్పటికి ఆంగ్లేయవర్తక కంపెనీవారి చేతిలో కీలుబొమ్మ స్థితికి దిగిపోయెను. ఆకంపెనీనౌకరుల దయాధర్మములపై నాధారపడ వలసిన వాడయ్యెను. లార్డు వెలస్లీ యీ నవాబుతో మరల నొక సంధియేర్పాటు గావించునాటి కీ నవాబు ఆంగ్లేయుల స్నేహపు వలలో జిక్కి వారిరక్షణ యురిత్రాళ్ళలో బాధపడుచు అసహాయుడై యుండెను. అతనిరాజ్యముయొక్క మేనేజిమెంటు కంపెనీవారిచేతిలో నుండెను. ఇప్పు డీ క్రొత్తసంధివలన నతని రాజ్యముయొక్క ఆదాయములో నైదువంతులలో నాల్గువంతులు కంపెనీవారికి శాశ్వతహక్కుగా నిచ్చి వేయబడెను. మిగిలిన ఐదవవంతు ఆదాయ మీ నవాబుపోషణకొరకు ప్రత్యేకింపబడెను. ఇట్టీనవాబు వీరిచేతిలో మనువర్తిదారుడైనాడు. పాతస్నేహము కృతజ్ఞతలను బట్టి ఈ భరణమును నవాబు దర్జాయు మాత్ర మీ దురదృష్టవంతుని కింకను గొన్నాళ్ళు మిగిల్చియుంచిరి. గాని 1853 నాటి గవర్నరుజనరలగు డల్‌హౌసీకి ఈ పూర్వకాలపు మర్యాదయు, ఈ దర్జాయు, మనువర్తియు, అర్థములేనట్లుగా కనబడి కంపెనీడైరక్టర్లతో ఆలోచించి ఈ కృతజ్ఞత ప్రహసనము నంతటితో నంతమొందింప దలచి అప్పటి కర్ణాటక నవాబు తదనంతరము వచ్చిన అజిం పానీబిరుదు వహింపవలదని నిషేధించి అతని కీయవలసిన ఐదవవంతు ఆదాయము నిచ్చుటకు నిరాకరించెను.