పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/522

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

భారతదేశమున


పాలకు లను సంగతి గమనించి ఈ ప్రభుత్వోద్యోగులు వీరి తాబేదారులు ప్రజలను గౌరవించుటలేదు సరికదా వారితో కలిసిమెలసి మాటలాడుటయైనలేదు. డి. పి. డబ్లియు. శాఖలో నింకను లంచములు చెలరేగుచునేయున్నవి. సహకారసంఘములు జిల్లా బోర్డులు మునిసిపాలిటీలు కులతత్వకక్షలకు తావలములై స్వార్థపరులతోనిండి ప్రజల కుపకరింపకున్నవి. చిన్న చిన్న ప్రభుత్వోద్యోగులు డఫేదారులు పోలీసుజవానులు రాజకీయమునందు వచ్చినమార్పును అర్ధము చేసికొనలేకుండ నున్నారు. జనసామాన్యము తమ హక్కులను అర్ధము చేసుకొనలేకున్నది. ఈపరిస్థితులను మాన్పుటకు మనమంత్రులు వెంటనే తగుచర్య దీసికొనినతప్ప దేశప్రజలు ఈ ప్రభుత్వము వలన పొందతగిన లాభములను పూర్తిగా పొందజాలరు.

కాంగ్రెసుయొక్క గృహచ్ఛిద్రములు:- ఇక కాంగ్రెసులోకూడా కొన్నిలోపములు కనబడుచున్నవి. కాంగ్రెసులోనే వివిధభావములవారు వివిధభాషలవారు వివిధజీవితవిధానముల కలవాటుపడినవారు గలరు. కొందరు తమపవిత్రతను వీడి పతితులై దుర్మార్గము లొనరించుచున్నారు.

కాంగ్రెసు సంస్థలకు ప్రభుత్వములో గొప్పపలుకుబడి యున్నందున వీనిలో ప్రవేశించి వీనిని వశపరచు కొనుటకు ఇతర పక్షీయులు స్వార్థపరులు, పూర్వపు మల్లుతానుల ప్రభుభక్తి పరాయణులు, మహాప్రయత్నములు చేయుచు కాంగ్రెస్ ఎన్నికలలో అనేక అన్యాయములు జరుపుచున్నారు.