పుట:ప్రబోధచంద్రోదయము.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“రసోవైసఃరసగ్ హ్యేవాయంలబ్ద్ఠ్వానందీ భవతి" అను శ్రుతివలన బ్రహ్మరసస్వరూపుడని నిరూపింపబడుటచే ధ్యానావలంబనీ భూతరసాభి వ్యంజకము గావున నీనాటక మావశ్యకము"

పైయుదాహృతభాగమున ఆచార్యులవా రెంతలోకోత్తరముగా ప్రబోధచంద్రోదయ నాటకావశ్యకతను నిరూపించిరో తెలియగలదు. ఇందలి ప్రధానాంశములు రెండు. 1. అభినయము;

అభినయప్రధానమైన నాటకము గ్రంథాదులమూలమున గలుగు పరోక్షజ్ఞానము కన్న ప్రత్యక్షజ్ఞానము గలిగించును. ఈ జ్ఞానమువలన ఆయా కళలయందు, కౌశల మేర్పడును. వేదాంతపరిభాషలో ఈ జ్ఞానము సజాతీయము. బ్రహ్మసూత్ర భగవద్గీతోపషదుక్తమైన జ్ఞానము విజాతీయము. ఈ నాటకమున పరోక్షమైన ఆ విజాతీయజ్ఞానము ప్రత్యక్షము గావింపబడినది.

2. రసము

నాటకప్రదర్శనమున సామాజికులయందు రస ముత్పన్నమగును. కాని అది లౌకికమైన ఆనందమును మాత్రమే సమకూర్చును. అది భౌతికమైన పాత్రలచే ప్రదర్శితమగును గాన నది సజాతీయానందము.

రసము బ్రహ్మస్వరూపము. అందువలన ఆధ్యాత్మికమైన పాత్రములమూలమున ప్రదర్శితమైన నాటకము విజాతీయమైన బ్రహ్మానందము గలిగించును. జీవుడు బ్రహ్మముతో నైక్యసిద్ధిపొందును. ఇదియే రససిద్ధి ఆద్వైతవేదాంతసిద్ది.

సంస్కృత ప్రబోధచంద్రోదయ నాటకమునకు మూలము

సంస్కృత ప్రబోధచంద్రోదయ నాటకమునకు మూలము పురంజనోపాఖ్యానము. ఇది భాగవతము చతురస్కంధమున 25, 26, 27, 28 అధ్యాయములలో నున్నది.