పుట:ప్రబోధచంద్రోదయము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అద్వైతపరముగా నీనాటకము వెలసిన వెనుక వేదాంతదేశికులు (1270-1372) విశిష్టాద్వైతపరముగా సంకల్పసూర్యోదయము అను నాటకమును ఆ వెనుక మల్లనారాధ్యుడను నాతడు శివాద్వైతపరముగా "శివలింగసూర్యోదయము” అను నాటకమును రచించిరి. కాని ప్రబోధచంద్రోదయమునకు వచ్చిన కీర్తి వీనికి రాలేదు కేవలము ఆనుకరణములుగా నిలిచిపోయినవి.

ఈ నాటకమునకు క్రీ.శ. 1520లో కొండవీటి దుర్గాధ్యక్షుడు కృష్ణరాయల మహామంత్రి సాళ్వతిమ్మరసు మేనల్లుడునగు నాదిండ్లగోపమంత్రి "చంద్రిక" అను పేర నొకవ్యాఖ్యానము రచించినాడు. ఆవ్యాఖ్యానముతోడనే ఈ నాటకము ముద్రితమైనది (1924). ఇటీవల పోడూరి సుబ్రహ్మణ్యసుధి ప్రౌఢప్రకాశ యను పేర నీనాటకమును వ్యాఖ్యానించెను. తంజావూరి ఘనశ్యాముడు కూడ నొకవ్యాఖ్య రచించెను. (D12560 మ.ప్రా.లి.పుస్తకశాల).

నాటకవిశిష్టత

ఈ నాటకవిశిష్టతను జంటకవు లి ట్లవతారికలో పేర్కొన్నారు.

సీ.

వివరింపనిది సర్వవేదాంతసారంబు
                          తలఁపగా నిది గట్టి తెలివిత్రోవ
ఇది భోగమోక్షసంపదలకు మూలంబు
                          మోస లేదిది ఘనంబులకు ఘనము
జ్ఞానకర్మరహస్యసాధనంబును నిది
                          యిది నవరసముల నీనుసురభి
షడ్దర్శనంబులు సరవి నిందున్నవి
                          సందేహములు దీఱ విందుగాని


గీ.

యిమ్మహారసపాకము నెఱిఁగినట్టి
జనుఁ డెఱుంగడు మఱి తల్లిచన్నుపాలు
దీనిసరి చెప్ప మఱి లేవు త్రిభువనముల
దొరక దీకృతి నీవంటి దొరకు గాని.

(1-21)