పుట:ప్రబోధచంద్రోదయము.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంస్కృత ప్రబోధచంద్రోదయము

సంస్కృతనాటకసాహిత్యమున ప్రబోధచంద్రోదయమున కొక ప్రత్యేకస్థానము గలదు. శృంగారవీరరసములలో నేదైనయొకటి నాటకమున విధిగా నుండవలయునన్న యాలంకారికమతమునకు (ఏకవివభవేదంగీ శృంగారోవీర ఏవవా) విలక్షణముగా శాంతరసప్రధానమగు నీనాటకమును కృష్ణమిశ్రు డనుకవి రచియించెను. కృష్ణమిశ్రుడు కవీశ్వరుడేకాక యతీశ్వరుడు. ఈత డద్వైతవిద్యాపారంగతుడై, చేదిదేశపురాజైన కీర్తివర్మ పట్టాభిషేకసమయమున నీనాటకము ప్రదర్శింపజేసెను. కీర్తివర్మకాలము క్రీశ 1100 ప్రాంతమగుటచే కృష్ణమిశ్రు డాకాలమునాటివాడు.

నాటకరచనోత్పత్తి కారణములు

దీనికి రెండు కథలు గలవు:

1. కృష్ణమిశ్రుని కనేకశిష్యులు గలరు. వారిలో నొకశిష్యుడు వేదాంతాదివిషయకగ్రంథముల చదువ నొల్లక, శృంగారరసవిషయికములైన గ్రంథములే చదువుచుండెడివాడు. అతనికి వేదాంతసార ముపదేశించి, శృంగారవిముఖునిగా చేయుటకు గురువగు కృష్ణమిశ్రుడు ప్రబోధచంద్రోదయము నాటకముగా రచించెను.

2. రాజైన కీర్తివర్మకు కృష్ణమిశ్రు డెన్నివిధముల నద్వైతమతము బోధించినను అతని మది కెక్కలేదు. అప్పుడు కామక్రోధాదులగు దుర్గుణములను మతి, వివేకాదులకు సద్గుణములను, పాత్ర లనువుగా జేసి యుద్ధమును జానాజ్ఞానములకు కల్పించి నాటకముగా రచించి దానిని ప్రదర్శింపజేసి కీర్తివర్మ కద్వైతమునం దభిరుచి గల్గించెను.

ఈ రెండు కథలుసు వాస్తవములై యుండవచ్చును. విషయప్రబోధమునకుగాని విషయప్రచారమునకు గాని నాటకము పరమసాధనమని గ్రహించి కృష్ణమిశ్రు డీవేదాంతనాటకము రచించెను.