ద్విపదకావ్యము
కావ్యకర్త రాచూరి వేంకటలింగమంత్రి. ఇది యైదాశ్వాసములు గలది. అముద్రితము.[1] ఈతడు దాక్షిణాత్యకవి. క్రీ.శ. 1800 ప్రాంతమువాడు.
ఆధునికయుగము
సంస్కృతనాటకమునకు యథానువాదనాటకకర్తలు కందుకూరివీరేశలింగము (1892) వడ్డాది సుబ్బారాయడు (1893) ఆకుండ వ్యాసమూర్తిశాస్త్రి (1911)[2] వీనిలో నేవియు ప్రచారములోనికి రాలేదు.
శ్రీగట్టి లక్ష్మీనరసింహశాస్త్రిగారి యనువాదము క్రిందటియేడు క్రీ.శ. (1975) ప్రకటితమైనది.
అద్వైతపరముగా నీ నాటకము రచించిన వెనుక సంస్కృతమున దీని కనుకరణములు బయలు వెడలినవి. వానిలో పేర్కొనదగినవి రెండు-
1 సంకల్ప సూర్యోదయము - ఇది విశిష్టాద్వైతపరముగా రచింపబడినది. కృతికర్తలు మహాప్రసిద్ధులు వేదాంత దేశికులు (1270-1372)
2 శివలింగసూర్యోదయము - ఇది శివాద్వైతపరముగా మల్లనానారాధ్యులచే రచితమైనది.
పైరెండును రచించినకవులు ప్రతిభావంతులే యైనను, కేవలము అనుకరణములుగా నిలిచిపోయినవేగాని ప్రచారములోనికి రాలేదు.
పైవివరణములనుబట్టి సంస్కృత ప్రబోధచంద్రోదయనాటకము మహాగంభీరమైన అద్వైతవేదాంతమును ప్రతిపాదించు ఆధ్యాత్మికనాటకమని మనకు స్పష్టమైనది.