పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

పద్మపురాణము


క.

హృద్యతరగానమున నన
వద్యుం డగువాఁడ దివిజవరుసన్నిధి న
వ్విద్యాధరాలిలోపల
నాద్యుఁడ సుముఖుండు నాఁగ నలరుదు నచటన్.

148


ఆ.

దేవనగము కేగి దివిజేశు కడనుండి
వచ్చుచోట నిట్లు వరమునీంద్ర!
నెపములేక నాదు లపనంబు పులిమోము
భంగియయ్యెఁ దొంటిపాపమునను

149


వ.

నాటనుండి మొగ మెత్తనేరక సిగ్గువడి విపినంబులఁ జరించుచు
విషాదంబున నుండుదు; నే డిందులకు మీరు విజయం చేయుట
యెఱింగి చనుదెంచి భవద్దర్శనంబునం గృతార్థుండ నైతినని
చెప్పి కృతాంజలియై మఱియు నిట్లనియె.

150


సీ.

ఇది నా మనోహరి యిందుబింబానన
      తరలాయతాక్షి కాంతాలలామ
పిన్నపాయమునాఁడు కిన్నరేశ్వరుఁ గొల్చి
      కైలాసమున కేగి గారవమున
నవ్యవీణానాదదివ్యగానంబుల
     మృడుని నారాధించి మెప్పు వడసె
నారదుఁ డెప్పుడు నలినాక్షిగానంబు
     వినఁగోరి యెంతయు వేడ్క సేయు


తే.

నిట్టి సుకుమారి నా కబ్బినట్టిచోట
నింపుపొంపిరి వోవ భోగింపలేక
వికృతవదనంబు నాకైన వేదనమున
సంతతంబును నెరియుదు సన్మునీంద్ర!

151