పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

పద్మపురాణము


నగు వసిష్ఠమహామునీంద్రు [1]నుపాశ్రయించి తత్ప్రసాదంబున
సకలవేదవేదాంగపారగుండై పరమపుణ్యస్వరూపంబునుం బద్మ
సంభవప్రోక్తంబును నగు పద్మపురాణంబున సర్గ ప్రతిసర్గవంశ
మన్వంతరంబులును బ్రహ్మర్షి రాజర్షి వంశకీర్తనంబును భూవిస్తా
రంబును సకలవర్ణాశ్రమధర్మంబులును సకలదీక్షానియమంబు
లును సకలవ్రతనియమాచరణంబులును సకలదేవతాశక్తి
స్వరూపభేదంబులు సకలమంత్రరహస్యంబులును శివరాఘవ
సంవాదంబును శైవరహస్యంబులును నాదిగాఁ గల బహుకథా
జాలంబంతయు సవిస్తరంబుగాఁ బూర్వమధ్యమఖండంబులు విని
పరమజ్ఞానసంపన్నుండై యమ్మహాముని దనకు నాచార్యుండుగా
సుదక్షిణాదేవి తనకు ధర్మపత్నిగా నఖిలమునిజనసమ్మతంబున
నశ్వమేధాధ్వరంబు సదక్షిణంబుగ సంపూర్తి గావించి యపభృథ
స్నానానంతరంబున దివ్యాంబరభూషణాలంకృతుండై సకలముని
జనాశీర్వచనంబులును వందిజనపఠననినదంబులును భేరీమృదం
గాదివాదిత్రనాదంబులును జెలంగఁ బురజనులు తన్నుం బరి
వేష్టించికొనియుండ సుఖోపవిష్టుండై కొలువున్న యవసరంబున.

90


తే.

మృగయుఁ డొక్కఁడు చనుదెంచి మొగుడుఁ గేలు
ఫాలతలమున నిడి భూమిపాలుమ్రోల
నిలిచి వినిపించె మృగముల నెలవులెల్ల
నరసి వచ్చితి దేవ! నీయడుగు లాన.

91


క.

అవ్వనములు దమమయమై
యౌవనమున నొకటి కొకటి నఱుముచు మిగులున్
గ్రొవ్వి కడుమసురు కనిసిన
వవ్విపినంబులను మృగము లవనీనాథా !

92
  1. నుపాసించి (ము)