పుట:పంచతంత్రి (భానుకవి).pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇందు దూబగుంట నారాయణకవి గ్రంథము మొదటిది. కీ॥ శే॥ శ్రీ డాక్టరు చిలుకూరి నారాయణరావుగారి పరిశోధనవలన, వేంకటనాథ కవి యచ్యుతదేవరాయలకు సమకాలికుఁడని తేలుటవలన, ప్రకృతమగు నీ భానుకవి పంచతంత్రము రెండవదియును, వేంకటనాథునిది మూఁడవదియు నగుచున్నవి.

కృతికర్త

తిప్పయభాస్కరునిఁ గూర్చి, యీ కావ్యప్రస్తావనలో నున్న—

మ.

“పరవాగ్వైఖరి, లక్షణజ్ఞతను, శ్రీవత్సాన్వయఖ్యాతి, భూ
వరమాన్యప్రకృతిం బురాతనసుకావ్యప్రౌఢిమన్ భారతీ
వరమంత్రిప్రతిభన్ మహేశపదసేవానిష్ఠ నిన్ బోల రు
ర్వరలోఁ దిప్పయ భాస్కరేంద్ర! [బుధవర్ణ్యమ్ముల్?] భవద్భాగ్యముల్.”

యీ పద్యము వలన, నీతఁడు లాక్షణికుఁ డనియును, శ్రీ వత్సగోత్రజుఁ డనియును, రాజసభాపూజ్యుఁ డనియును, ప్రాచీనకావ్యభంగుల నెఱిఁగినవాఁ డనియును దెలియుచున్నది. ఆశ్వాసాంతగద్యములలో "భారతీవరప్రసాదలబ్ధవిద్యావిచిత్ర, తిప్పనమంత్రిపుత్ర, సుజనవిధేయ, భానయ నామధేయ" ఆని యుండుట వలనఁ, దండ్రిపేరు తిప్పయ యనియును, నితనికి భానయ యనికూడ వ్యవహారమున్నట్లును, దెలియుచున్నది. కావ్యాంతమున, నితఁ డిట్లు చెప్పికొనెను,—

సీ.

పంపా విరూపాక్ష భైరవ విఠ్ఠలే
        శ్వర ముఖ్య దేవతావ్రజముచేత,
పరిపంథిగర్వవిభాళన శ్రీకృష్ణ
        రాయభూధవభుజారక్షచేత,
భటనటజ్యౌతిషపౌరాణికభిష
        గ్విచక్షణ సత్కవీశ్వరులచేత,
సంతతమదవారిచారుశుండాలఘ
        టాజవప్రకటఘోటములచేత,


గీ.

రమ్యమై యున్న విద్యాపురంబుసంధు,
నిమ్మహాకృతి భాను కవీశ్వరుండు