పుట:పంచతంత్రి (భానుకవి).pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

మాతృకలు

చెన్నపురి ప్రభుత్వప్రాచ్యలిఖితగ్రంథాలయమున, నీ భానుకవి పంచతంత్రిఁ బ్రతులు రెండు గలవు, ఒకటి తాళపత్రప్రతి. డి. నంబరు, 3025. వేఱొకటి కాగితపుఁబ్రతి. డి. నంబరు, 2684. కాఁగితపుఁబ్రతి మొదటిదానికిఁ బుత్రిక. దీనియం దచ్చటచ్చటఁ గొన్నిపద్యచరణములును, గొన్నిపదములును లోపించినవి. పంచమాశ్వాసమున, మొదటఁ గొంత గ్రంథపాతము గలదు. అసంప్రేక్ష్యకాంత్వమను నీ యైదవతంత్రమున, బహుశః మొదటి కథయును, రెండవ కథలోఁ గొంత భాగమును లోపించినవి. అశిథిలమగు ప్రత్యంతరము దొరకమిచే, లుప్తభాగములను బూరించుటకుఁగాని, సందిగ్ధస్థలములఁ బాఠనిర్ణయ మొనరించుటకుఁగాని యవకాశము లేమిని, తోఁచిన రీతిని, ఆయాస్థలములలోఁ బరిశిష్టభాగములను బట్టి, భావములను బొల్చికొని కొన్ని కొన్నిపూరణములను, సందిగ్ధస్థలములఁ బాఠనిర్ణయములను జేయవలసివచ్చినది. అనువుకాని స్థలములను యథాతథముగనే యుంచి ముంద్రింపవలసివచ్చెను.

పంచతంత్రములు

మడికి సింగనార్యుఁడు తన “సకలనీతిసమ్మతమునఁ” బంచతంత్రములోనివని కొన్నిపద్యముల నుదాహరించియుంచుటవలన, నిప్పటి కుపలభ్యమానము లగుచున్న చంపూరూపములగు పంచతంత్రములకన్న ముందే, ఒక పంచతంత్ర ముండియున్నట్లు తెలియుచున్నది. కాని, అది నామమాత్రావశిష్టము.

శ్రీకృష్ణ దేవరాయలయుగమునఁ జంపూరూపమున వచ్చిన పంచతంత్రములు మూఁడు.

1. దూబగుంట నారాయణ కవిది.
2. తిప్పయభాస్కరునిది (ప్రకృత కావ్యము).
3. పర్వతరాజు వేంకటనాథ కవిది.

ఈ మూఁడును, శ్రీకృష్ణదేవరాయల యుగమునఁ బరిమిత..... గొంచెము, ముందు వెనుకలుగ వెలసినవి.