పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పరుసున వచ్చు నె ట్లవనిఁ బండు జగంబు సుభిక్ష మెట్లగు
న్నరపతి లేడె యిక్కడ ననాథలపెన్మొఱ యాలకింపఁగన్.

272


వ.

అని తల విరియఁబోసికొని రక్తసిక్తంబగు మొగంబు విధుంతుదదంతకుంతనిర్భిన్నచం
ద్రబింబంబు విడంబింప గుంపులు గొనిచూచు జనులకుఁ దునిసినముక్కుఁ జూపి
వెక్కి వెక్కి యేడ్చుచు నెట్లాయెం గంటిరే యనుచు నద్దంట మగనిమీద నపరాధం
బొదవ నీవడుపున మొఱపెట్టుచుండె నప్పుడు.

273


క.

ఇటు నటు నన నోరాడక, తటతట నెడ యదర నోరఁ దడిలే కొడలా
రటపడఁగనుండె నపుడ, చ్చట మంగలి తొంగలించుసంత్రాసమునన్.

274


క.

గిలుకలు వేసిన గుదియలు, ఘలుఘల్లన నూఁదికొనుచుఁ గతమేమీ యీ
కలకలమున కనుచు వడిం, దలవరు లేతెంచి యవ్విధం బరసి ధృతిన్.

275


ఉ.

మంగలిఁ బట్టి కట్టికొని మానవనాథునిమ్రోలఁ బెట్టి చె
ప్పం గనలెత్తి యాత్మపరిపాలితవిశ్వధరిత్రి నింతహం
తం గనుగొంటలేదు కొఱఁతం బడపైవుఁడు వీని నంచు రా
జుంగర మిచ్చి యారెకుల కొప్పనఁజేసె దృఢప్రయత్నుఁడై.

276


క.

తలవరులు వానిఁ గొని చని, తలపొలమునఁ గొఱఁతఁ దివ్వఁ దమకించుతఱిన్
గలతెఱఁగుఁ జెప్పి భిక్షకుఁ, డలమంగలి నిరపరాధుఁడని యెఱిఁగించెన్.

277


వ.

మేషయుద్ధంబున నక్కయు నాషాఢభూతిచేత సన్యాసియుఁ దంతురాయిచేత
దూతికయు స్వాపరాధంబున బాధంబొందిరి యేనును నిట్టివాఁడనేకదా యని వెచ్చ
నూర్చిన దమనకునకుం గరటకుం డిట్లనియె.

278


క.

కేసరివృషమైత్రి యనా, యాసక్రియఁ జెఱుపఁజాలు నట్టియుపాయం
బోసుగుణీ చేకూరదొ, కో సరసప్రజ్ఞ తలఁచుకొమ్మన నతఁడున్.

279


క.

సరసోపాయముచేతను, కరణి పరాక్రమముచేతఁ గా దెట్లన్నన్
గరటము సుతపరిపంథిం, బొరిగొనదే కనకసూత్రమున గృష్ణాహిన్.

280


క.

అన రిపుదమనకు దమనకుఁ, గనుంగొని కరటకుఁడు పలికె ఘనబోధనసా
ధనసాధుసూక్తి నిక్కథ, ననురక్తిం జెప్పుమనిన నతఁ డిట్టనియెన్.

281


క.

మనుజులు మిట్టాడని యొక, ఘనగహనమహీరుహమునఁ గాకంబులతో
డొనరించుడింభములఁ గీ, ల్కొననీకమ్మనికిఁ గఱిచిలువ దినుదప్పిన్.

282


క.

ప్రతిసంవత్సరమును నీ, గతిఁ బిల్లలఁ బాము పాము గడతేర్పంగాఁ
బ్రతికృతికి నేర్పుజాలక, యతిదీనతఁ గాకమిథున మచ్చో నుండున్.

283


ఆ.

అంతఁ బ్రసవయోగ్యయగుభార్యఁ జూచి కా, లాహి చళికితచిత్త మగుచుఁ గాక
మడలు గడలుకొనఁగ వడి నేగెఁ దనమైత్రి , గలిగి తిరుగు జంబుకంబుకడకు.

284