పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

యిద్ధనంబు సుబుద్ధి గ్రహించెఁ గాని, దుష్టబుద్ధికిఁ బని లేదు దృష్ట మనుచు
నీవు పలికిన నది తీఱిపోవుఁ బిదప, మనకుఁ గలకాల మెల్లను మనుట గలుగు.

515


వ.

అనిన విని దుష్టబుద్ధికిఁ దజ్జనకుం డిట్లనియె.

516


చ.

చెడుతరువాయి నిట్టిపని చెప్పితి గాని ధనంబుకాంక్షకున్
గడపలలేదు హీనమతి గప్పినవానికి దుష్టబుద్ధి నా
నొడువఁగ నున్నని న్నిటు తనూభవుఁగాఁ గనునట్టిపాపపుం
జెడుఁ గగునాకు దుర్లభమె చెప్పెడు నారకబాధ పుత్రకా.

517


వ.

అని పలికి మఱియు నిట్లనుఁ బ్రాజ్ఞుం డుపాయంబు చింతించిన పిదప నపాయం
బునుం దలంపవలయుఁ దొల్లి బకమూర్ఖంబునకుం గలయపత్యంబుల నొక్కముంగి
మ్రింగినచందం బగు విను మని యిట్లనియె.

518


మ.

ఒకకాసారతటంబునందు నొరపై యున్నట్టివృక్షంబుపై
బకయుగ్మంబు వసింప భార్య పురుషుం బ్రార్థించి యోనాథ య
ర్భకరాజిం దీనిపోవఁ గ్రిండఁ గలసర్పం బేపుమై నింక న
చ్చిక నేతెంచుఁ బ్రసూతికాలమును వచ్చెం కార్య మెట్లుండునో.

519


వ.

అనిన విని బకవిభుం డమ్మహీరుహంబు డిగ్గి కొలనితీరంబున నిల్చి విచారించు సమయం
బువ నయ్యెడకు నొక్కకుళీరంబు చనుదెంచి యిది యేమి దుఃఖాకులుండవై
యున్నవాఁడ వనిన నబ్బకం బిట్లనియె.

520


ఉ.

నాకులకాంత గర్భమయి నందనులం గనునంతలోన ద
ర్వీకర మేఁగుదెంచి తిని వేగమ పోయెడు నెల్లి నేఁటిలో
నాకలకంఠి వెండియును నర్భకులం గనువేళ గాన నే
నాకులతఁ దలంకెద మదాత్మకు నేమియుఁ దోఁపకుండఁగన్.

521


వ.

అనినం గర్కటంబు నీకుం దగినయుపాయంబు చెప్పెద విను మని యిట్లనియె.

522


గీ.

నకులవివరంబునందుండి నాగవిభుని, యునికిదాఁకను మీనంబు నొకటినొకటి
వైచుకొనిపోవ నాముంగి వరుసఁ దినుచుఁ, బాముఁ జంపును దీని ముపాయ మిదియె.

523


వ.

అని కుళీరంబు చెప్పినఁ గొక్కెర యవ్విధం బాచరింప నకులం బమ్మత్స్యంబులఁ
దినుచుం జనిచని కృష్ణసర్పంబును ఖండించి వృక్షం బెక్కి ఒకదంపతులయపత్యంబు
లను భక్షించెం గావున.

524


క.

తనబ్రతుకుకొఱకు నొరునిం, గనికర మొక్కింత లేక కారించినయ
మ్మనుజుఁడు గనఁ డున్నతశో, భనముల నెన్నండు మూర్ఖబకముంబోలెన్.

525