పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని యిట్లు చెప్పినతండ్రిపలుకులు గైకొనక దుష్టబుద్ధి లోభాక్రాంతుడై బలా
త్కారంబున నతని నొప్పించుకొనిపోయి నిశామధ్యంబున, దత్తరుకోటరంబున
నునిచి ప్రభాతసమయంబున.

526


సీ.

ఆదుష్టబుద్ధి ధర్మాధికారులఁ బిల్చి, కులము పెద్దలఁ గూర్చుకొని కడంగి
ధర్మబుద్ధియుఁ దోన తడయక చనుదేర, నావృక్షమునకు సాష్టాంగ మెసఁగి
సత్యంబ పలుకు వృక్షము సాక్షి వీవన్న, బూని వనస్పతిలోననుండి
ధర్మబుద్ధి మొరంగి ధనముఁ గైకొనెఁ గాని, పుచ్చుకోఁ డీదుష్టబుద్ధి యన్న


గీ.

వాగ్విలాసంబు వినఁబడ్డ వార లెల్ల, నద్భుతం బంది కనుఁగొనునంతలోన
మ్రాను పలికినచోటు దా మహి నెఱిఁగి, పాటిమాలి యసత్యంబు పలికె ననుచు.

527


వ.

ఆధర్మబుద్ధి యంతరంగంబునఁ గోపోద్దీపితుం డై.

528


గీ.

కుజము వెస నెక్కి యామీ, దికొమ్మ లరసి, తొలఁగ వీక్షింపునపు డొకతొఱ్ఱఁ గాంచి
యింగలంబును బూరియు నెసఁగఁ దెచ్చి, కోరటంబున వైచి యచ్చోటు దొలఁగ.

529


క.

అనలజ్వాలాజాలము, తనదేహము చుట్టుముట్టఁ దల్లడపడుచున్
మునుకొని మొఱ్ఱలు పెట్టుచు, జనములపై దుష్టబుద్ధిజనకుం డుఱికెన్.

530


గీ.

పడినసెట్టిఁ జూచి పైఁబడి ధర్మాధి, కారు లెల్ల బ్రమసి కదిసి యడుగ
సుతుఁడు దుష్టబుద్ధి సుండు న న్నిటువంటి, యుడుకు చేసె ననుచు నుసుఱు విడిచె.

531


వ.

విడిచినం జూచి ధర్మాధికారు లత్తెఱం గంతయు మహీకాంతునకుం జెప్పిన నతండు
దుష్టబుద్ధిం గొఱత వేయం బంచి వాని సర్వస్వంబునుం జూఱకొనియె నని చెప్పి
కరటకుండు మఱియు నిట్లనియె.

532


సీ.

సుమధురవాహినీసంపూర్ణజలములు, వడి లవణాబ్ధిలో నడఁగుదాఁక
ప్రకటితస్నేహసంబంధబంధుత్వంబు, లంగనానిర్భేద మయినదాఁక
నత్యంతకాంతరహస్యవాక్యంబుల, వివరించి కొండీఁడు విన్నదాఁక
కలితపారంపర్యకులసమృద్ధి దలంప, నిలఁ గుపుత్త్రుం డుదయించుదాఁక


గీ.

నిలుచునేగాని యటుమీఁద నిలువ కునికి, దప్ప దందురు నయశాస్త్రధర్మవిదులు
నీవు కులహాని యగునట్టి నీచగతికిఁ దగిననడవడి గన భయం బగుచు నుండు.

533


గీ.

కడఁగి పిశునవృత్తిఁ బెడఁబాయ కుండిన, వాని వదలకున్నవాఁడుఁ జెడును
నురగశాబకంబుఁ జిరకాల మొగిఁ బెంప, మెఱసి యొక్కవేళఁ గఱువకున్నె.

534


గీ.

ఎఱుకగలవానిపొం దైన నెందు నమరు, నతఁడు కపటాత్ముఁ డయ్యనే నదియుఁ గాదు
మూర్ఖుతోఁ గూడి మెలఁగెడుమూర్ఖశఠుని, సఖ్య మెన్నండుఁ గొఱ గాదు సజ్జనులకు.

535